మంత్రి రావెలకు మత్తయ్య మద్దతు: ఎవరి ప్రోద్బలంతో జగన్పై ఫిర్యాదు?
అమరావతి: ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ కుమార్, ఆయన కుమారుడు సుశీల్పై అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి మీడియా, వైయస్ జగన్, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్కి ఫిర్యాదు చేశారు.
అయితే మత్తయ్య ఫిర్యాదు వెనుక అంతర్యం ఏమిటనేది అర్ధం కావడం లేదు. వైసీపీని ఎదుర్కొవడానికే టీడీపీ వ్యూహంలో భాగంగా ఈ ఫిర్యాదు చేశారా లేక మంత్రి కుమారుడిని వెనుకేసుకొచ్చేందుకు ఈ ఫిర్యాదు చేశారా? అనేది అంతుబట్టడం లేదు.
ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మత్తయ్య నడిరోడ్డుపై ఓ లేడీ చేయి పట్టిన లాగిన కేసులో చంచల్ గూడ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇలా సడన్గా ప్రత్యక్షమైన మత్తయ్య వైయస్ జగన్, సాక్షి మీడియాపై కమిషన్కు ఫిర్యాదు చేయడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందనే అనుమానాలకు తావిస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మంత్రి రావెల కిశోర్ బాబును ప్రతిపక్షమైవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసేందుకు సిద్ధమైంది. మరోవైపు మంత్రి రావెల పుత్రుడి నిర్వాకాన్ని ప్రభుత్వం వెనకేసుకు వస్తోందా? అని శాసనసభలో వైసీపీ నిలదీస్తే దానికి జవాబు చెప్పుకోలేక టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంది.
మంత్రి రావెల కుమారుడి విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహత్మకంగానే వ్వవహారించనుందని తెలుస్తోంది. కాగా గతవారంలో ఒక ముస్లిం మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను మంత్రి రావెల తనయుడు సుశీల్పై నిర్భయ కేసు నమోదు చేశారు.
మంత్రి రావెల తనయుడి ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని మందలించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తే అందుకు ఏ విధంగా ఎదురుదాడికి దిగాలో కూడా మంత్రి రావెల సిద్ధమైనట్లు సమాచారం.
ఇంతకీ మత్తయ్య ఎవరి ప్రోద్భలంతో సాక్షి మీడియా, వైసీపీ నేతలపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్కి ఫిర్యాదు చేశారో? తెలియాల్సి ఉంది.