ఓటుకు నోటు: టిడిపి ఎమ్మెల్యే అరెస్ట్కు రంగం సిద్ధం? స్పందించిన మాగంటి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఓటుకు నోటు అంశం సంచలనం రేపిన విషయం తెలిసిందే.
టిడిపి అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు డబ్బులు ఇవ్వజూపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గతంలోనే తెలంగాణ ఏసీబీ అధికారులు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను అరెస్టు చేశారు.
ఓటు కోసం ఇవ్వజూపిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఏసీబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న టిడిపి ఎమ్మెల్యేకు దీనిలో పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం నగర పార్టీలో కీలకంగా ఉన్న ఆ ఎమ్మెల్యేను ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అతను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేనా?
కాగా, ఆ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అని వార్తలు వస్తున్నాయి. అతని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి.. గోపీనాథ్ నుంచే ఆ నగదు తీసుకుని స్టీఫెన్సన్ వద్దకు వెళ్లారని ఏసీబీ దర్యాప్తులో తాజాగా వెల్లడైంది.
తాజా ఆధారాలతో మాగంటికి నేడో రేపో వారంటు జారీ చేసి, అరెస్ట్ చేయాలని ఏసీబీ పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
వీలైనంత త్వరగా ఈ కేసును ఒక కొలిక్కి తేవాలని ఏసీబీ ప్రయత్నిస్తోందని ఓ అధికారి చెబుతున్నారని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గోపీనాథ్ రేవంత్ రెడ్డికి నగదు సమకూర్చినట్టు భావిస్తున్నారు. గోపీనాథ్ను అరెస్ట్ చేసి విచారణ జరిపితే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
నాకు సంబంధం లేదు
ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాగంటి గోపినాథ్ అన్నారు. తనకు నోటీసులు అందలేదని చెప్పారు. ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్లు పార్టీని వీడటం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. తెరాస నుంచి తనకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని, తాను టిడిపిలోనే ఉండి ప్రజాసమస్యలపై పోరాడుతానని చెప్పారు.