మోడీకి సీఎం రేవంత్ థ్యాంక్స్
జనాభా లెక్కలతోపాటు కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర కేబినెట్కు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతోందన్నారు.
రాహుల్ గాంధీ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే. రాహుల్ విజన్ తో రాష్ట్రంలో కులగణన చేపట్టాం. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పోరాడింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనూ ఆందోళన చేశారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోందని మరోసారి రుజువైంది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

మరోవైపు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కేంద్రం దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల్లో కులగణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి దేశానికి దుక్సూచిగా మారిందన్నారు. కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని పొన్నం తెలిపారు.
కుల గణన కేంద్రం నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జనగణనతోపాటు కులగణన నిర్వహిస్తామనడం హర్షించదగిన విషయమన్నారు. రాహుల్ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టామన్నారు. కేంద్రం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడితో కులగణనకు ఒప్పుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
మోడీ సర్కారు సంచలనం! జనాభా లెక్కలతోపాటు కులగణన
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తదుపరి జనాభా లెక్కలను నిర్వహించాలని నిర్ణయించింది. అంతేగాక, జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీన్ని చేర్చుతామని కేంద్రం పేర్కొంది.
ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు. కాగా, 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు జరగని విషయం తెలిసిందే.
కాగా, గత కొంత కాలంగా విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనాభా లెక్కలతోపాటు కులగణన చేయాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు, దేశంలో కూడా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేసేందుకు నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications