RS Praveen Kumar: ఆర్ఎస్పీ అభిమానిని-భవిష్యత్తులో కలిసి పనిచేయొచ్చు-సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలనం
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరడంతో తెలుగు రాష్ట్రాల్లో బహుజన రాజ్యాధికారంపై మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. 1990 దశకంలో ప్రజా ఉద్యమాల్లో నుంచి ఎదిగొచ్చిన నేతల సారథ్యంలో అప్పట్లో ఆశలు రేపిన బీఎస్పీ.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు నేలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంట్రీతో బహుజన రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలను ప్రవీణ్ ఎలా ఏకం చేయగలరు... రాజ్యాధికారం దిశగా వారిని ఎలా నడిపించగలరనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పనుంది. మరోవైపు ప్రవీణ్ రాకపై సామాన్యుల్లోనే కాదు ప్రధాన రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఎస్ ప్రవీణ్ అభిమానిని : లక్ష్మీనారాయణ
ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో జేడీ లక్ష్మీనారాయణ ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రవేశంపై మాట్లాడారు.'ప్రవీణ్ నాకు మంచి మిత్రుడు.ఎప్పటినుంచో కలిసి మాట్లాడుకుంటాం. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానిని.ఆయన అంకితభావం... గురుకుల విద్యలో ఆయన ఏవిధంగా మార్పులు తీసుకోచ్చారో చూశాం. ఆయన మార్గదర్శకంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు పిల్లలు.గురుకులాల నుంచి చాలామంది ఐఐటీలకు వెళ్లారు.
అటువంటి అనుభవం ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ ప్రజా జీవితంలోకి రావడం స్వాగతించాల్సిన విషయం,హర్షించాల్సిన విషయం. ప్రవీణ్ కుమార్కు మొదట కంగ్రాచులేషన్స్ చెప్పింది నేనే. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అన్నారు అంబేడ్కర్. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని కాన్షీరాం అమలుచేశారు. అదే బాటలో ప్రవీణ్ కుమార్ బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించాలనుకుంటున్నారు.' అని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

భవిష్యత్తులో కలిసి పనిచేయొచ్చు : లక్ష్మీనారాయణ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో జేడీ లక్ష్మీనారాయణ కలిసి పనిచేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు జేడీ ఆసక్తికర సమాధానమిచ్చారు. 'భవిష్యత్తులో కలిసి పనిచేయొచ్చు. అన్ని ఆప్షన్స్ ఓపెన్గా ఉన్నాయి. ఫైనల్గా ఏంటంటే... అందరికీ రాజ్యాధికారం కావాలనే కోరికతో ఉన్నవాళ్లం. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ రాజ్యాధికారం దిశగా నడిపించాలనేది ఇద్దరి ఆలోచనా విధానం.' అని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
జేడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. కొంతమంది జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా... మరికొందరు ప్రవీణ్,జేడీ లక్ష్మీనారాయణ రెండు భిన్న ధ్రువాలని అభిప్రాయపడుతున్నారు. జేడీ లక్ష్మీనారాయణ కూడా తన ఐపీఎస్ పదవిని వదులుకుని 2018లో రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019 లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి జనసేన తరుపున పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు జనసేనను వీడిన జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరలేదు.

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి విశ్లేషణ...
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర విశ్లేషణ చేశారు.'దళితులు,బీసీలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. మోసం చేసే మనిషి రకరకాల జిమ్మిక్స్ చేస్తాడు. ఇప్పటికే కేసీఆర్కు దళితులు దూరమయ్యారు. ప్రవీణ్ కుమార్పై చర్యలకు చిన్నజీయర్ స్వామి కేసీఆర్పై ఒత్తిడి తెచ్చాడని చెబుతున్నారు.
ఏదేమైనా ఈటల రాజేందర్లా చివరి వరకు వేచి చూడకుండా ప్రవీణ్ ముందే బయటకు రావాలనుకున్నాడు. బాగా చదువుకున్నవాడు కాబట్టి కేసీఆర్ గురించి తెలిసి పదవికి రాజీనామా చేసి బయటకొచ్చి బీఎస్పీలో చేరాడు. బీఎస్పీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగింది. సుందరయ్య యాదవ్,కేజీ సత్యమూర్తి,కొల్లూరి చిరంజీవి,కత్తి పద్మారావు లాంటి నేతలు,కాన్షీరాం గ్లామర్ ఆ పార్టీకి ఉండేది. నల్లా సూర్యప్రకాశ్ బీఎస్పీ నుంచి బయటకు వెళ్లాక అది చుక్కాలని లేని పడవ అయింది.
ప్రవీణ్ రాకతో పార్టీకి మళ్లీ చుక్కాని వచ్చినట్లయింది. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కూడా బీఎస్పీలో చేరుతారని చెబుతున్నారు. ఈ ఇద్దరు ఏకమై అన్ని వర్గాలను కలుపుకుని పోతే కేసీఆర్ను దెబ్బకొడుతారు.' అని పాశం యాదగిరి విశ్లేషించారు.

హాట్ టాపిక్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ
ఇటీవల నల్గొండ ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగిన సభతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్నారు.నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో తన ఎజెండా,లక్ష్యం క్లియర్గా ప్రకటించారు ప్రవీణ్ కుమార్.స్వచ్ఛందంగా తరలివచ్చిన మీ ఉత్సాహం చూస్తుంటే.. ప్రగతి భవన్ దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.
ఏనుగు ఎక్కి ప్రగతి భవన్కు పోదాం.. ఏనుగు ఎక్కి ఎర్రకోటలో నీలి జెండా ఎగరేద్దామని అన్నారు.లక్షలాది మంది పేదల గొంతుకగా మారేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. బంగారు తెలంగాణలో కొందరి బతుకులు మాత్రమే బాగు పడ్డాయని, నాలాగా లక్షల మంది బిడ్డలను చైతన్యం చేయడానికి సోషల్ వెల్ఫేర్లో పనిచేశానని చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు ప్రవీణ్ కుమార్.
సంక్షేమ పథకాలు, దళిత బంధు పైసలు ఎవరివి.. మావి కాదా..? అని ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్... పేద పేద బడుగు బలహీనవర్గాల కష్టపడిన సొమ్ము తోనే కేసీఆర్ విచ్చలవిడిగా దుబారా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గాదరి కిశోర్ నోరు అదుపులో పెట్టుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగం ఊడుతుందేమోననే భయంతోనే ఆయన పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే గాదరి వ్యాఖ్యలపై బీఎస్పీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications