ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ: తెలంగాణాలో సీబీఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
తెలంగాణ రాష్ట్రంలో సిబీఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా? తెలంగాణ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు అనుమతులు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో, కవిత విచారణకు సిబిఐని తెలంగాణలోకి అనుమతిస్తుందా? ఇప్పటికే ఎప్పుడు ఎప్పుడు తెలంగాణలో అడుగు పెడదామా అని చూస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో వెసలుబాటు దొరుకుతుందా? అంటే కావచ్చు అన్న సమాధానం వినిపిస్తుంది.
తెలంగాణాలో సీబీఐ కి నో ఎంట్రీ అన్న తెలంగాణా ప్రభుత్వం
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరిన బీజేపీకి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు సాధారణ అనుమతి నిరాకరిస్తూ 3 నెలల క్రితం హోం శాఖ జారీ చేసిన జీవోను హైకోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి, దర్యాప్తు చేయడానికి అవకాశం లేదని హైకోర్టు సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది.
ఇటీవల సీబీఐ నోటీసులు అందుకున్న గంగుల కమలాకర్, వద్దిరాజు రవి చంద్ర
ఆగస్టు 30వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసి తెలంగాణలో సి.బి.ఐ దర్యాప్తు లకు చెక్ పెట్టడానికి ప్రయత్నం చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ పై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇక ఆ తర్వాత తాజాగా ఫేక్ సిబిఐ అధికారి శ్రీనివాస్ కేసులో దర్యాప్తులో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కు సిబిఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సీబీఐ అధికారులను తన ఇంటికే రమ్మన్న కవిత
ఈ క్రమంలో కూడా సిబిఐ తెలంగాణ రాష్ట్రంలో విచారణకు అనుమతి లేని కారణంగా, ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని వారికి ఆ నోటీసులలో పేర్కొంది. ఇక తాజాగా కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నోటీసులు జారీ చేసిన సిబిఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 160 సి ఆర్ పి సి కింద వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. డిసెంబర్ 6 వ తేదీన తమకు వివరణ ఇవ్వాలని కోరిన సిబిఐ అధికారులకు కవిత తన ఇంటి దగ్గర కలుస్తానని చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇస్తానని పేర్కొన్నారు.
భవిష్యత్ లోనూ సీబీఐ కి ఎంట్రీ ఉంటుందా?
కవిత తాజా ప్రకటనతో సిబిఐ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి విచారణ జరపడానికి కవిత కేసుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కవిత విషయంలోనే ఈ వెసులుబాటు కల్పించిందా.. ఇంకా భవిష్యత్తులో ఏ వ్యవహారాల్లోనైనా సీబీఐ అధికారులు తెలంగాణ రాష్ట్రం నుండి నాయకులను దర్యాప్తు కోరితే, వారి విషయంలోనూ తెలంగాణలో దర్యాప్తు చేసుకోవచ్చని ప్రకటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.