ఏపీ, పంజాబ్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు? కేసీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదంటూ కేంద్రం కౌంటర్
న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల నుంచి బియ్యం సేకరణ విషయంలో కేంద్రంపై కేసీఆర్ సర్కారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే స్పష్టం చేశారు. ఢిల్లీలో కేసీఆర్, టీఆర్ఎస్ నేతల నిరసన నేపథ్యంలో తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ సర్కారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు: కేంద్రం
బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రంపైనా వివక్ష ఉండదని, ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే బియ్యం సేకరిస్తామని కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే స్పష్టం చేశారు. దేశంలో వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్నే అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బియ్యం సేకరణపై తెలంగాణ సర్కారు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి బాయిల్డ్ సేకరణను తగ్గించినట్టు వివరించారు. ప్రస్తుతం ఎఫ్సీఐ ఏ రాష్ట్రంలోనూ పారాబాయిల్డ్ రైసు తీసుకోవట్లేదని స్పష్టం చేశారు

ఏపీకి లేని సమస్య తెలంగాణకు ఎందుకు: కేంద్రం ప్రశ్నలు
ధాన్యంపై తెలంగాణ ఆరోపణలు అవాస్తవం. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం సేకరిస్తున్నాం. ఏపీ, తెలంగాణ రెండూ ఒకే వాతావరణ జోన్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తోంది. రా రైస్ ఎంతైనా సేకరించేందుకు ఎఫ్సీఐ సిద్ధంగా ఉంది. రా రైస్ ఇచ్చేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. దేశమంతా ఒకే ప్రొక్యూర్మెంట్ విధానాన్ని మేం అవలంభిస్తున్నాం. ధాన్యం విషయంలో రైతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధం ఉంటుంది. బియ్యం సేకరణపై మాత్రమే రాష్ట్రాలతో మా ఒప్పందం ఉంటుంది. రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సిన బియ్యం ఇంకా ఉందనేది వాస్తవం' సుధాంశు పాండే వివరించారు. రబీపై పలుమార్లు ప్రతిపాదనలు కోరినప్పటికీ.. తెలంగాణ నుంచి ఇంకా పంపలేదన్నారు.

పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్ రైస్ కొనలేదు: కేంద్రం
ఎఫ్సీఐ నేరుగా ధాన్యం సేకరించడం సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు సుధాంశు పాండే. ధాన్యం మిల్లింగ్ చేసినందుకు మిల్లర్లకు డబ్బు చెల్లిస్తున్నామని... ఒక ఏజెంట్గా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం సేకరిస్తాయని స్పష్టం చేశారు. పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదన్నారు. పంజాబ్లో ధాన్యాన్ని మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తోందని తెలిపారు. ఏపీలోనూ ఎఫ్సీఐ నిబంధనల ప్రకారమే ధాన్యం సేకరిస్తున్నట్టు తెలిపారు. ఎఫ్సీఐ వద్ద ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ఉందని సుధాంశు పాండే తెలిపారు. అత్యధికంగా తెలంగాణ నుంచి 48.8 లక్షల టన్నుల బాయిల్డ్ రైసు తీసుకున్నామన్నారు పాండే. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మరో 20 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైసు సేకరించినట్టు తెలిపారు. ధాన్యం విషయంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలే అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications