హైదరాబాద్ అందరిదీ, సెటిలర్స్ అనాల్సిన అవసరం లేదు: వెంకయ్య
హైదరాబాద్: హైదరాబాద్ అందరిదని, సెటిలర్స్ అనాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్ర వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వివాదాలు మాట్లాడేందుకు తాను రాలేదని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలను చూసి మోసపోవద్దని హితవు పలికారు. స్వచ్ఛభారత్లో భాగంగా తెలంగాణకు రూ. 480 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవ్వాలంటే మంచి నేతలు రావాలని ఓటర్లకు సూచించారు.
ఇక పాతబస్తీలో వెనుకబాటుకు కారణమెంటో మజ్లిస్ పార్టీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సైదాబాద్, చంపాపేట, రామంతాపూర్, కార్వాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.