ప్రధాని మోడీకి కేసీఆర్ విన్నపం: తెలంగాణకు ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ కోటా పెంపు, కేంద్రమంత్రి ఫోన్
హైదరాబాద్: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రెమిడిసివిర్, ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినతి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ప్రస్తుతం రోజుకు 5,500 రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇస్తుండగా మరో 5వేలు కలిపి మొత్తం 10,500 చొప్పున సరఫరా చేయనుంది.
తెలంగాణకు అదనంగా 200 టన్నుల ఆక్సిజన్, వ్యాక్సిన్ కోటా పెంపు
ప్రస్తుతం 430 టన్నుల ఆక్సిజన్ను తెలంగాణకు సమకూరుస్తుండగా 200 టన్నులు అదనంగా ఇవ్వనుంది. కేంద్ర పరిశ్రమలు, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్ శనివారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ మేరకు ఫోన్ చేసి తెలిపారు. తెలంగాణకు అవసరమైనన్ని టీకాలను త్వరలో సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రెండో డోసు వ్యాక్సిన్కే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రమంత్రి సూచించడంతో.. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రెండో డోసు మాత్రమే ఇస్తున్నామని తెలిపారు కేసీఆర్.
తెలంగాణ సర్కారు కోరిన మేరకు ఈ రాష్ట్రాల నుంచే ఆక్సిజన్ సరఫరా
ఇక తెలంగాణ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భిలాయి, ఒడిశాలోని అంగూల్, పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్ నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి కాకుండా దగ్గరి రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో కోఆర్డినేట్ చేసుకోవాలని కేసీఆర్కు కేంద్రమంత్రి సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల ప్రకారం అవసరమున్న రాష్ట్రాలకు ఆక్సిజన్, రెమిడివివిర్, కరోనా వ్యాక్సిన్లను అందజేస్తున్నామని తెలిపారు.
కేసీఆర్ విన్నపం.. ప్రధాని మోడీ ఆదేశం
కాగా, ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ రాష్ట్ర అవసరాలను తెలియజేశారు. అందరికీ కరోనా వైద్యం అందించాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో టీకాలు, రెమిడిసివిర్, ఆక్సిజన్ ను తగిన మేరకు సరఫరా చేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన అదేరోజు కేసీఆర్తో మాట్లాడారు. అధికారులతో చర్చించి తెలంగాణకు కోటా పెంచే నిర్ణయం తీసుకున్నారు. పెంచిన కోటా సోమవారం నుంచి సరఫరా అవుతాయని కేంద్రమంత్రి తెలిపారు.