వెంకయ్యకు కవిత ఘాటు కౌంటర్, ప్రస్తుతానికి తగ్గుతాం!: బిజెపికి టిఆర్ఎస్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. లోకసభలో ఆయన ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు.
అధికారపక్షం ఎక్కువ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హైకోర్టు విభజనపై కేంద్రం ప్రకటన చేసిన నేపథ్యంలో, హైకోర్టు తీర్పు వచ్చే వరకు తమ ఆందోళనలను విరమించుకుంటున్నామని ఆమె చెప్పారు.
సభా కార్యక్రమాలకు అడ్డుపడమని చెప్పారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన కోసమే కమిటీ వేశారని, కింద స్థాయి ఉద్యోగుల విభజనపై ఎలాంటి మార్గదర్శకాలు లేవన్నారు. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఉద్యోగుల విభజన అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుస్తామన్నారు.

బుధవారం నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ లోకసభలో మాట్లాడుతూ.. హైకోర్టు విభజన పైన తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను ప్రస్తావించారు. హైకోర్టు విభజనను తెలంగాణ వేసిన పిటిషనే ఆపుతుందని టిఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ రోజు (గురువారం) కవిత మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆందోళన విరమించుకుంటామని చెప్పారు.
హైకోర్టు ఏర్పాటు అంశం బుధవారం లోకసభను కుదిపేసింది. టిఆర్ఎస్, బిజెపి ఎంపీల మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. హైకోర్టు విభజనను అడ్డుకుంటోందని టిఆర్ఎస్ ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి ఆరోపించారు.
దీనిపై వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించారు. దీనిని రాజకీయం చేయవద్దని హితవు పలికారు. మేము ముందుగా భారతీయులమని, తాను ఒక జాతీయ పార్టీకి చెందిన వ్యక్తిని అని, అందుకు గర్విస్తున్నానని చెప్పారు. ఇది ఉద్వేగపరమైన అంశమని, అలాంటి అంశాలను రేకెత్తించవద్దన్నారు.
కవిత చంద్రబాబు గురించి ప్రస్తావించగా... సభలో లేని వ్యక్తుల పేర్లను ప్రస్తావించవద్దని, సభలో చిన్నపిల్లలా మాట్లాడవద్దని ఎంపీ కవితకు హితవు పలికారు. మీరు ఏం చేస్తారో చేసుకోండని అవసరమైతే ప్రత్యేక హైకోర్టుపై సదానంద చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని చెబుతామన్నారు.
తెలంగాణలో టిఆర్ఎస్ హామీలు నెరవేర్చలేదన్నారు. అవసరమైతే వాటి పైన కూడా మాట్లాడుతామన్నారు. హైకోర్టు విభజన పైన కవిత చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య ఆగ్రహించారు. చంద్రబాబు పేరును ప్రస్తావంచడాన్ని సభాపతి కూడా తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications