వాటర్ వార్లో జగన్కు జలక్..కేంద్రం తాజా ఆదేశాలతో కొత్త టర్న్..ఇక కేసీఆర్తోనే నేరుగా..!
పోతిరెడ్డి పాడు వాటర్ ఫైట్ కొత్త టర్న్ తీసుకుంది. ఇద్దరు మిత్రులుగా అన్నదమ్ములుగా మెలిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. ఇద్దరు సీఎంలు ఓపెన్గా ఎటువంటి కామెంట్స్ చేయనప్పటికీ ఇద్దరికీ మాత్రం ఈ వ్యవహారం ప్రతిష్టాత్మకంగానే మారింది. తెలంగాణలోని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా దూకుడు పెంచాయి. ఏపీలో ఇతర పక్షాలు ముఖ్యమంత్రికి బాసటగా నిలవగా టీడీపీ మాత్రం తటస్థ వైఖరి తీసుకుంది. ఇదే సమయంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి తీసుకున్న తాజా నిర్ణయం ఏపీ సీఎంకు ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.
సీఎం జగన్కు కేంద్ర జలక్
ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం నుంచి తమ వాటా నీటిని వినియోగించుకునేందుకే పోతిరెడ్డిపాడు జీవో జారీ చేశామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే జీవో పైనా తెలంగాణలో రాజకీయంగా వేడెక్కింది. తెలంగాణ మంత్రుల నుంచి ప్రతిపక్షాలు సైతం ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం దీనికి భిన్నంగా తమ నిర్ణయానికి మద్దతుగా తమ వాదనను ప్రజల ముందుంచారు. ఇందులో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన విషయమే లేదని తేల్చి చెప్పారు. తమ వాటాకు లోబడే నీటి వినియోగం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా సాగుతున్న సమయంలో రాయలసీమకు నష్టం లేకుండా పోతిరెడ్డిపాడుపై తీసుకున్న నిర్ణయంలో ముందుకు సాగాలని ఏపీ బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది.
బండి సంజయ్ లేఖకు కేంద్రం స్పందన
తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ జగన్ కుమ్మక్కు అయ్యారంటూ విమర్శలకు దిగారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనగా దీక్షకు దిగడంతో పాటుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్కు లేఖ రాశారు. దీనిపైన వెంటనే స్పందించిన ఆయన బండి సంజయ్ కు సమాధానం పంపారు. అందులో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలు కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా రివర్ బోర్డును ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ప్రాజెక్టులు నీటి వివాదాలపైన రెండు ప్రభుత్వాలు కేంద్రం సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. ఇప్పుడు ఇది ఏపీ పాలటిక్స్లో హాట్టాపిక్గా మారింది.
ఇద్దరు సీఎంలు చర్చించుకుంటారా..?
గతంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలుదఫాలుగా సమావేశమైన సమయంలో ఏ వివాదంపైనైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని పరిష్కరించుకోవాలని మధ్యవర్తులపైన కేంద్రం పైన ఆధారపడుకూడదని తీర్మానించారు. ఇప్పుడు కేంద్రం జోక్యంతో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రం వద్దే ఈ పంచాయతీ తేల్చుకుంటారా లేక తాము గతంలో నిర్ణయించినట్లుగా వారిద్దరూ సమావేశమై అపోహలు నివృత్తి చేసుకుంటారా అనేది ఇప్పుడు హాట్టాపిక్.
Recommended Video
లాక్డౌన్ తర్వాత భేటీ అయ్యే అవకాశం..?
ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ద్వారా ఆదేశాలు ఇప్పించడంతో ఏపీ బీజేపీ నేతలు సైతం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇతర పార్టీలకు కేంద్రానికి అవకాశం లేకుండా పోతిరెడ్డిపాడుతో సహా ఇతర సమస్యలపైనా చర్చించుకోవాలనేది వారి అభిమతంగా తెలుస్తోంది. దీనిపైన అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.