చలో అసెంబ్లీ టెన్షన్: ముందస్తు అరెస్టులు, రాత్రిపూట ఓయులో సోదాలు
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రిపూట ఓయు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ఎదురుకాల్పులకు నిరసనగా ప్రజా సంఘాల నాయకులు, వామపక్షాల నేతలు బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.
ఓయు హాస్టళ్లలో, నిజాం కళాశాల హాస్టల్లో మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించి 200 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు ప్రజా సంఘాల నాయకులకు పోలీసులు గృహనిర్బంధం విధించారు ప్రజా సంఘాల నేతలను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్కు వచ్చే రహదారులపై చెక్ పోస్టులు పెట్టారు. అసెంబ్లీకి వెళ్లే అన్ని దారుల వద్ద ఆంక్షలు విధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద గట్టి నిఘా పెట్టారు. వామపక్ష నేతలను వరంగల్లో అరెస్టు చేశారు.
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను పోలీసులు గృహనిర్బంధం చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ ఏర్పడిందని, ఉద్యమాలను అణచాలని చూస్తే ప్రజలు తిరగబడుతారని చుక్కా రామయ్య అన్నారు.