'కెసిఆర్ పర్మిషన్తో హైదరాబాద్లో అడుగు పెట్టాల్సిన దుస్థితి చంద్రబాబుది'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనుమతితోనే హైదారబాద్లో తిరిగి అడుగు పెట్టాల్సిన దుస్థితిలో పడ్డారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
కెసిఆర్కు చంద్రబాబుకు మధ్యవర్తిగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు వ్యవహరించారని ఆయన అన్నారు. నోటుకు ఓటు కేసులో కెసిఆర్ ఇచ్చిన కండీషన్ బెయిల్ మీద చంద్రబాబు ఎపిని పాలిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కుమ్మక్కు రాజకీయాలు చేసే చంద్రబాబుకు తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వాట్ ఐ యామ్ సేయింగ్ అంటూ ఫోన్ సంభాషణల్లో అడ్డంగా దొరికిపోయినా కూడా ఇప్పటి వరకు ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని అంబటి రాంబాబు అన్నారు.
బినామీ పేర్లతో టీవీ చానెళ్లను నడిపించే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు మద్దతు వార్తలు ప్రసారం చేయడం లేదని 13 జిల్లాల్లో ఓ టీవీ చానల్ ప్రసారాలను నిలిపేశారని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కోసం గతంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలను ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కర్లను ఉద్దేశించి టిడిపి దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు.