టీ-టీడీపీ నేతలకు చంద్రబాబు డైరెక్షన్స్ : తెలంగాణను వదల్లేదని వ్యాఖ్య
హైదరాబాద్ : తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాక.. తెలంగాణలో తెలుగుదేశం ప్రభ మసకబారిన సంగతి తెలిసిందే. అధినేత చంద్రబాబు ఏపీకి పరిమితమైపోవడం.. నేతల మధ్య సమన్వయ లోపంతో పార్టీ మరింత ఢీలా పడే పరిస్థితి. మధ్య మధ్యలో సమావేశాలు నిర్వహించి మరీ.. కలిసికట్టుగా ముందుకెళ్లాలని అధినేత సూచిస్తున్నా.. పార్టీ నేతల మధ్య సమన్వయం మాత్రం కుదరట్లేదు.
ఈ నేపథ్యంలోనే టీ-టీడీపీ నేతలతో మరోసారి సమావేశమయ్యారు అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీ బలోపేతానికి సంబంధించి నేతలకు పలు సూచనలు చేసిన ఆయన, 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు నేతలంతా కృషి చేయాలని చెప్పినట్టు సమాచారం.
ఇకపోతే తాను ఏపీకే పరిమితమైపోయానన్న వ్యాఖ్యలను తప్పుబడుతూ.. తాను తెలంగాణను వదల్లేదని నేతలకు చెప్పారట చంద్రబాబు. నేతల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటానని టీ-టీడీపీ నేతలతో చెప్పుకొచ్చిన చంద్రబాబు.. ఏపీ నుంచి పనిచేస్తున్నంత మాత్రానా, ఆంధ్రాకు పరిమితమై ఇక్కడి నుంచే దిశానిర్దేశం చేస్తున్నట్టుగా భావించవద్దని నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది.

అలాగే ప్రతి చిన్న విషయానికి ఏపీతో పోలిక అనవసరమని నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఇక నేతలతో పలు సరదా వ్యాఖ్యలు చేస్తూ.. ఏపీలో సెన్సార్ విధానంతోనే పథకాల అమలుతీరును పర్యవేక్షిస్తున్నామని, మీ పనితీరును అలాగే పరిశీలిస్తామని చంద్రబాబు సరదాగా అన్నారు.
ఇదే సమావేశంలో విశాఖలో చేపడుతున్న ఎల్ఈడీ బల్బుల అమలుకు సంబంధించి.. వాటి పనితీరును సెన్సార్ ద్వారా టీటీడీపీ నేతలకు ల్యాప్ టాప్ లో చూపించారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications