హైదరాబాదులో అల్లర్లకు చంద్రబాబు కుట్ర: శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలోని ఏ బ్లాక్వద్ద తెలంగాణ ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి విజయవాడ కోర్టు ఆదేశాలు అందించేందుకు ఏపీ సిట్ అధికారులు తెలంగాణ సెక్రటేరియట్కు వచ్చారని తెలుసుకున్న తెలంగాణ ఉద్యోగులు దాదాపు 350మంది ఏ బ్లాక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.
తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్డార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేశారు. ఏ బ్లాక్ 5వ అంతస్తులో ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి వెళ్లే ప్రయత్నంచేశారు. తెలంగాణ ఉద్యోగులు మెట్లు ఎక్కుతుండగా చూసిన ఆంధ్రా పోలీసులు హడావిడిగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్త్రివేదికి నోటీస్లు ఇచ్చి, బీ బ్లాక్లోకి వెళ్లి అక్కడినుంచి కిందకు దిగి వెళ్లిపోయారు.
ఏపీ పోలీసులను ఎస్పీఎస్ సిబ్బంది తెలంగాణ సచివాలయం నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి మహబూబ్నగర్ ఎమ్మెల్యే, టీజీవో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తరువాత కూడా ఏపీ పోలీసులు వచ్చి నోటీస్ల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు అక్కడి మద్రాస్ ప్రభుత్వం ఏపీ వారిని రాత్రికి రాత్రే పొమ్మని ఆదేశించినట్లుగా ఇక్కడ ఆదేశించలేదని, పదేండ్లు ఇక్కడ ఉండటానికి అవకాశం ఇస్తే కథలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కావాలంటూ తెలంగాణకు మాత్రం అడుగడం లేదన్నారు.
తెలంగాణను దెబ్బతీసే విధంగా, తెలంగాణకు కేటాయించిన నీటి వాడుకోవడానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు దొంగతనంగా పార్లమెంటులో ప్రశ్నలు వేయించారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ద్రోహుల భరతం పడతామని చెప్పారు. ఈ ఆందోళనలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు సత్యనారాయణ, రవీందర్రావు, కృష్ణయాదవ్, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.