శ్రీలంకపై ధోనీ టీమ్ లాగే తెలంగాణలో చంద్రబాబు జట్టు
హైదరాబాద్: శ్రీలంకపై తొలి ట్వంటీ20 మ్యాచులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు ఆటతీరు చూశాం. చాలా మంది కొత్తవాళ్లతో వచ్చిన శ్రీలంక బౌలర్ల ముందు కాకలు తీరిన భారత బ్యాట్స్మెన్ తోక ముడిచారు. కేవలం 101 పరుగులు చేసి పది వికెట్లను 20 ఓవర్లలోగానే జార విడుచుకున్నారు.
తెలంగాణలో చంద్రబాబు జట్టుకు కూడా అదే వర్తించేట్లుంది. తొలి విడత ఆరుగురు శాసనసభ్యులు వరుసగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి జారుకున్నారు. తెలుగుదేశం శాసనసభా పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు లాంగ్ ఇన్నింగ్సే ఆడాడు. కానీ పరుగులు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఆయన పార్టీని బలోపేతం చేయడానికి చేసిన కృషి చాలా తక్కువ అనేకన్నా ఆయన పనిచేయడానికి తగిన వెసులుబాటు చిక్కలేదు.
సీనియర్ నేతలందరినీ పక్కకు తోస్తూ రేవంత్ రెడ్డి దూకుడుగా ఆడే ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నాడు. రేవంత్ రెడ్డి దూకుడు ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు వెలవెల బోయారు. అనూహ్యంగా, ఏ మాత్రం అనుమానం రాకుండా తెలుగుదేశం దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్ వికెట్లను కోల్పోయింది. ఉదయం పూట తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిద్దరు కూడా సాయంత్రం అయ్యేసరికి పార్టీ ఫిరాయిచారు.
ఇక పదో వికెట్ సంగతి మరింత ఆశ్చర్యకరంగా ఉంది. దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్ పార్టీ మారిన నేపథ్యంలో ఆత్మస్థయిర్యం నింపడానికి హైదరాబాదుకు రెక్కలు కట్టుకుని వాలిన చంద్రబాబుకు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పెద్ద షాక్ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ టిడిపి విస్తృత స్థాయి సమావేశానికి రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీతోనే ఉంటానంటూ చెప్పారు. చంద్రబాబు ఓ వైపు ధైర్యవచనాలు చెబుతుంటే ఆయన అక్కడి నుంచి చల్లగా జారుకుని తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇలా టిడిపి పదో వికెట్ కోల్పోయింది.
ఎల్బీ నగర్ శాసనసభ్యుడు ఇక ఎక్స్ట్ట్రా ప్లేయరే. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు హెచ్చరికలు చేసి పోయారు. ఆ తర్వాత కాపు రిజర్వేషన్ల నేపథ్యంలో టిడిపితో తనకు సంబంధం లేదని ప్రకటించేశారు. పదకొండో వికెట్ ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నట్లుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీరు తయారైంది.
క్రికెట్ క్రీడలో ధోనీలాగా చంద్రబాబు రాజకీయాల్లో సమర్థుడైన కెప్టెనే. కానీ బ్యాట్స్మెన్ ఎదుటి బౌలర్ల ముందు నిలబడలేకపోతే కెప్టెన్ మాత్రం ఏం చేస్తాడు. దాదాపుగా ధోనీ పరిస్థితే చంద్రబాబుకు కూడా వచ్చింది. అయితే, 2109లో వచ్చే టెస్టు మ్యాచులో మాత్రం విజయం సాధిస్తామని చంద్రబాబు అంటున్నారు.