తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న టీడీపీ?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే లేదు అనేవారికి ఆ పార్టీ గట్టి సమాధానం చెప్పబోతోంది. ఎవరూ ఊహించని రీతిలో చాపకింద నీరులా రాష్ట్రం మొత్తం పనిచేసుకుంటూ వెళుతోంది. సభ్యత్వాలను పెంచింది. ఎక్కడా అంచనాలు లేని స్థితిలో కూడా రాష్ట్రం మొత్తం పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఖమ్మంలో భారీ బహిరంగసభ
తెలంగాణలో పార్టీకి మంచి క్రేజ్ తెచ్చే ఉద్దేశంతో, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్ నిరంకుశ పరిపాలనను ప్రజలు భరించలేకపోతున్నారని చంద్రబాబునాయుడు తెలంగాణ నేతలతో అన్నారు.

శతజయంతి ఉత్సవాలతో తెలంగాణలో బలోపేతం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణతోపాటు ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని, ఈ సభతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా వెనకబడిలేదని చాటాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను అందుకు వేదికగా ఉపయోగించుకోబోతున్నారు. ఒక్క బహిరంగసభే కాకుండా తెలంగణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ నేతలు బక్కని నర్సింహులు, రావుల చంద్రశేఖర్రెడ్డి, అరవింద్కుమార్గౌడ్, నర్సిరెడ్డి, జక్కలి ఐలయ్య యాదవ్ తదితరులతో చర్చించారు.

ఎన్నికల బరిలోకి తెలుగుదేశం?
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడవబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మూడు పార్టీలకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటర్లు దేవుళ్లలా కనపడుతున్నారు. వారి ఓటు ఎటువైపు పడితే ఆ పార్టీకి విజయావకాశాలు మెరుగవుతాయనే అంచనా వుంది. అయితే ఈసారి తెలంగాణలో నెలకొన్న భిన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సొంతంగా పోటీకి దిగాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది.
దీంతో తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో రసవత్తర పోరు నడవబోతోంది. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో బలమైన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications