చీము నెత్తురుంటే టిడిపిని వీడాలి, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూసి ఓర్వడం లేదన్నారు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూసి ఓర్వడం లేదన్నారు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు.తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడారని ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నవనిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ టిడిపి నాయకులు సిగ్గుపడాలన్నారు. బాబు వ్యాఖ్యలపై బిజెపి నాయకులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు హరీష్.
తెలంగాణపై చంద్రబాబు మరోసారి తన అక్కసును వెళ్ళగక్కారని చెప్పారు. అభివృద్దితో పోటీపడలేక విజభన పేరుతో తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. స్థానిక నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను రాహుల్ చదివారని చెప్పారు.
కుటుంబపాలన గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు హరిష్ రావు.తెలంగాణలో జరిగిన అభివృద్ది గురించి పల్లెల్లో తిరిగితే తెలుస్తోందన్నారు హరిష్ రావు.తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిన బిక్ష కాదన్నారు. రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకొన్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ పౌరుషం ఉంటే టిడిపిని వీడాలి
మరో వైపు తెలంగాణ పౌరుషం కలిగిన వారైతే చీము, నెత్తురు ఉంటే టిడిపిని వీడాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలంగాణ టిడిపిని డిమాండ్ చేశారు.తెలంగాణ మహనాడులో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడని చంద్రబాబునాయుడు, ఏపీలో ఈ రకంగా మాట్లాడం ఆయన నైజాన్ని బయటపెడుతోందన్నారు.
రాహుల్ ను విమర్శించే హక్కు లేదు
రాహుల్ గాంధీతో పాటు, సోనియాగాంధీని విమర్శించే హక్కు టిఆర్ఎస్ నాయకులకు లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి, ప్రధానమంత్రి పదవిని కూడ సోనియగాంధీ, రాహుల్ గాంధీలు త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులను అనుభవిస్తున్న కెసిఆర్ కుటుంబానికి సోనియా , రాహుల్ ను విమర్శించే హక్కే లేదన్నారు.సోనియా తెలంగాణ ఇస్తేనే కెటిఆర్ మంత్రి అయ్యారని ఆయన గుర్తుచేశారు.