తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన చంద్రబాబు .. ఏమన్నారంటే
Recommended Video
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు . పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలకు పాల్పడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. విద్యార్థుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు . ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
పరీక్షలకంటే ప్రాణాలు విలువైనవి .. విద్యార్థులనుద్దేశించి మాట్లాడిన చంద్రబాబు
పరీక్షల కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు . పరీక్షల్లో పాస్ కానంత మాత్రాన ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులను ఆశలను తుంచేయవద్దని విద్యార్థులకు సూచించారు.పరీక్షల్లో గెలవడమే జీవితం కాదని చెప్పిన బాబు పరీక్షలు కేవలం ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని పేర్కొన్నారు. తమపైనే ఆశలు పెట్టుకుని బతుకుతున్న తల్లిదండ్రులను కడుపుకోతకు గురిచేయవద్దని విద్యార్థులను కోరారు చంద్రబాబు .
చదువే జీవితం కాదు .. ఆత్మహత్యలతో ఏమి సాధించలేరన్న చంద్రబాబు
చదువు కేవలం విజ్ఞానం పెంచుకోవడానికేనని, అదే జీవితం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులనుద్దేశించి ఆయన అన్నారు . ఆత్మహత్య చేసుకోవటంతో ఏమి సాధించలేరని చంద్రబాబు అన్నారు. ఈ ప్రపంచంలో విజేతలుగా నిలిచిన వారందరూ ముందు పరాజయం చవిచూసిన వారేనని ఆయన అన్నారు.
మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు మీరిచ్చే బహుమతి అన్న ఏపీ సీఎం
విజయానికి ఓటమి తొలిమెట్టు అని, మళ్లీ కష్టపడితే మంచి ఫలితం వస్తుందని సూచించారు. ఒక్క చదువు అనే కాకుండా ఎంచుకున్న ఏ రంగంలో అయినా ప్రతిభ చూపితే బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుందని, మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు మీరిచ్చే గొప్ప బహుమతి అని చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ధైర్యంగా ముందడుగు వెయ్యాలని సూచించారు .