కాంగ్రెస్ ఎఫెక్ట్: మహానాడు సభలో రేవంత్ రెడ్డికి బాబు షాక్, కేసీఆర్పై నో కామెంట్
తాను జీవితంలో అరెస్టయింది బాబ్లీ ప్రాజెక్టు విషయంలోనే అని, తెలంగాణలో అధికారంలోకి వచ్చే వరకు పోరాడాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.
హైదరాబాద్: తాను జీవితంలో అరెస్టయింది బాబ్లీ ప్రాజెక్టు విషయంలోనే అని, తెలంగాణలో అధికారంలోకి వచ్చే వరకు పోరాడాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన తెలంగాణ మహానాడులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పొత్తులపై రేవంత్ రెడ్డికి పేరు చెప్పకుండా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తన ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వంపై మాట్లాడలేదు.
కేసీఆర్పై ఊగిపోయిన కిషన్ రెడ్డి
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో చంద్రబాబు - కేసీఆర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా సర్దుకు పోయింది. అప్పటి నుంచి తెలంగాణ సభల్లో కేసీఆర్ పాలన గురించి చంద్రబాబు పెద్దగా మాట్లాడటం లేదు. గతంలోను మాట్లాడలేదు.
తెలంగాణ ప్రత్యేక మహానాడులో చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్, పార్టీ గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడారు. పలువురు నేతలు మాట్లాడిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు.
టిడిపి పుట్టిందే ఇక్కడ
తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాదులో అన్నారు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్ అధికారం కోసం పార్టీ పెట్టలేదని చంద్రబాబు చెప్పారు. తెలుగు జాతికి అవమానం జరుగుతుందని గుర్చించి, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు.
తెలుగుజాతి ఉన్నంత వరకు, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా అందరి మనసుల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. చైతన్య యాత్రను ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచే ప్రారంభించారన్నారు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టిడిపి అన్నారు.
పొత్తులపై రేవంత్ రెడ్డికి ఝలక్
పొత్తుల విషయంలో మనం ఆలోచించుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. మనం ఏదంటే అది మాట్లాడవద్దని టిడిపి నేతలకు హితవు పలికారు. ఆలోచించి మాట్లాడాలన్నారు. బీజేపీ నేతలపై టిడిపి నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అలా మాట్లాడారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై జోరుగా చర్చ సాగుతోంది. ఏపీలో బిజెపిపై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే బాబు వారికి క్లాస్ పీకారు. తెలంగాణలోను రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో కలుస్తామని చెప్పారు.
రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే కాంగ్రెస్తో కలుస్తామన్న రేవంత్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక పార్టీ పరమైనవా చెప్పాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ నిలదీశారు. రేవంత్ వ్యాఖ్యలు, బీజేపీ ఆగ్రహం నేపథ్యంలో చంద్రబాబు పైవిధంగా స్పందించారు. పొత్తులపై తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
ఎన్టీఆర్ వల్లే..
పటేల్, పట్వారీ వ్యవస్థలో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డారని, కానీ ఎన్టీఆర్ దానిని రద్దు చేశారన్నారు. రాజకీయ చైతన్యం తీసుకు వచ్చింది ఎన్టీఆరే అన్నారు. బడుగు, బలహీన, పేద వర్గాలను రాజకీయ నేతలను చేశారన్నారు.
జనరేనషన్లు మారినా, పార్టీ పెట్టి 36 సంవత్సరాలు అయినా మంచి ఊపులో ఉందని చంద్రబాబు చెప్పారు. విజయ సాధనే లక్ష్యంగా మన టిడిపి ముందుకు పోతుందన్నారు. కార్యకర్తలు, నాయకుల త్యాగాల వల్లే టిడిపి ఈ స్థాయిలో ఉందన్నారు.
జాతీయస్థాయిలో మనమే..
జాతీయస్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీ, అలాగే, కేంద్రంలో అధికారాంలోకి తీసుకు వచ్చిన పార్టీ టిడిపి అన్నారు. తెలంగాణలో టిడిపిని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు పోరాడుతామని చెప్పారు.
తన జీవితంలో ఎప్పుడైనా అరెస్టయ్యానంటే అది బాబ్లీ కోసమే అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికుడిలా పని చేశారన్నారు. విభజన సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పానని, అది అందరు గుర్తుపెట్టుకోవాలన్నారు.
హైదరాబాద్ కృషిలో నేను
హైదరాబాదులో పెట్టుబడుల కోసం తాను కృషి చేసానని చెప్పారు. ఇప్పుడు నవ్యాంధ్ర కోసం కూడా అలాగే కష్డపడుతున్నానని చెప్పారు. కష్టపడటమే తన జీవితం అన్నారు. కష్టాన్ని ఆనందంగా తీసుకుంటానని చెప్పారు. అదే టిడిపికి శ్రీరామ రక్ష అన్నారు.
ఇక్కడి నేతలు భయపడకుండా పోరాడుతున్నారని తెలంగాణ నేతలపై ప్రశంసలు కురిపించారు. నా శ్రమ, ఎన్టీఆర్ శ్రమ, నాయకులు, కార్యకర్తల శ్రమ వల్లే పార్టీ ఇలా ఉందన్నారు. కార్యకర్తలు కొదమసింహాల్లా పోరాడాలన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ముహూర్తం వల్ల ఎవరికీ భయపడటం లేదన్నారు.
ఢిల్లీ వెళ్తే తెలంగాణ కోసం కూడా అడిగా
నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా ఏపీతో పాటు తెలంగాణ కోసం అడుగుతానని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో నా కష్టం ఉందన్నారు. ఔటర్ రింగు రోడ్డు, విమానాశ్రయం, హైటెక్ సిటీ చూస్తే గుర్తుకు వస్తాయన్నారు.
హైదరాబాద్ బాగుండాలని, తెలంగాణ బాగుండాలని చంద్రబాబు అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందన్నారు. కొత్త రాష్ట్రం ఏపీ కోసం సమయం కేటాయించవలసిన అవసరం ఏర్పడిందన్నారు.