అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక: జగన్, బాబుకు మంత్రుల రాఖీ
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైసిపి అధినేత జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైసిపి అధినేత జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
కవితకు చేనేత చీర పెట్టిన మంత్రి: కేటీఆర్ సూపర్ (వీడియో)
సోదర సోదరీమణుల మధ్య పరస్పర అనురాగాన్ని, ప్రేమానుబంధాలను ఈ పండుగ చాటి చెబుతుందని జగన్ తెలిపారు. ప్రజల్లో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని ఈ పండుగ చాటాలని ఆకాంక్షించారు. కాగా, జగన్కు ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు.
చంద్రబాబు శుభాకాంక్షలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ ఏపీ సీఎం చంద్రబాబు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సుజాత, టిడిపి మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు ఆయనకు రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. శ్రావణమాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనదన్నారు. రైతాంగానికి శ్రావణ పౌర్ణమి శుభసూచకమన్నారు. పంటలు బాగా పండాలని, సిరులు కురిపించాలని నేలతల్లికి పూజలు చేసి నాట్లు వేసే సమయం ఇదేనన్నారు.
మమతానురాగాలకు, ప్రేమానుబంధాలకు రాఖీ పండుగ నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం రక్షణ కవచంలా ఉంటుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం అభయహస్తం యాప్ను రూపొందించినట్లు చెప్పారు. మహిళల ఆరోగ్య రక్షణకు తమ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని చెప్పారు.