పెళ్లి పేరుతో హైదరాబాద్ లేడి డాక్టర్కు రూ. 48 లక్షలు టోపీ
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి హైదరాబాద్ కు చెందిన మహిళా డాక్టర్ ను మోసం చేసి రూ. 48.75 లక్షలు తీసుకుని కుచ్చుటోపి పెట్టిన మహిళతో సహ ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
నైజీరియాకు చెందిన జోసెఫ్ లోర్బర్ బహీమెన్ (26), బావ్ హిల్లరీ ఓంగాబీ (35), నాగాల్యాండ్ కు చెందిన లీనియా మాగ్ (26) అనే ముగ్గురిని అరెస్టు చేశామని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో మహిళ డాక్టర్ నివాసం ఉంటున్నారు.
ఇంగ్లాండ్ లో తాను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నానని, నేను అందమైన మహిళ డాక్టర్ ను వివాహం చేసుకోవాలని ఉందని ఆరు సంవత్సరాల క్రితం అభిషేక్ మోహన్ అనే వ్యక్తి ఒక వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన మహిళ డాక్టర్ అభిషేక్ మోహన్ ను సంప్రదించారు.
తాను భారత్ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు అని మోహన్ ఆమెతో చెప్పాడు. ఆ తరువాత ఇద్దరు ఆన్ లైన్ లో చాటింగ్ చేసుకునేవారు. తాను ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సహకరించినందుకు ఇరాక్ ప్రభుత్వం రూ. 5 కోట్ల విలువైన బంగారు నగలు బహుమతిగా ఇచ్చిందని ఆమెకు చెప్పాడు.
భారత్ లో ఉన్న తన బంధవుల మీద తనకు నమ్మకం లేదని మీ ఇంటికి బంగారు నగలు పంపిస్తానని మహిళా డాక్టర్ ను నమ్మించాడు. కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి మహిళా డాక్టర్ కు పోన్ చేశాడు. తాను ఢిల్లీ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారి అని పరిచయం చేసుకున్నాడు.
అభిషేక్ మోహన్ అనే వ్యక్తి బంగారు నగల పార్శిల్ పంపించాడని, మీరు ట్యాక్స్ చెల్లించి తీసుకు వెళ్లాలని చెప్పాడు. అతను చెప్పిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కు మహిళా డాక్టర్ రూ. 20 లక్షలు డిపాజిట్ చేశారు. తరువాత వివిద పన్నులు అంటు రూ. 28.75 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు.
తరువాత అభిషేక్ మోహన్ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మహిళా డాక్టర్ ఢిల్లీ కస్టమ్స్ అధికారులు సంప్రదించారు. తమకు మోహన్ అనే వ్యక్తి నుండి బంగారు నగల పార్శిల్ రాలేదని, తాము ఎవ్వరి దగ్గర నగదు డిపాజిట్ చేయించుకోలేదని ఆమెకు చెప్పారు.
మహిళా డాక్టర్ హైదారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీసులు కేసు ఢిల్లీ పోలీసులకు బదిలి చేశారు. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేసి గుర్గావ్ లో తల దాచుకున్న నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా ఇదే విధంగా చాల మందిని మోసం చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
అభిషేక్ మోహన్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ కు చెందిన ఫోన్ నెంబర్ తో పాటు, భారత్ సిమ్ కార్డుతో తనతో మాట్లాడేవాడని మహిళా డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.