అక్రమ లేఅవుట్లకు చెక్ .... తెలంగాణ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు... రిజిస్ట్రేషన్ లపై ప్రభావం
తెలంగాణ ప్రభుత్వం అక్రమ లేఅవుట్లకు చెక్ పెట్టడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్ ను పూర్తిగా నిషేధిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త మున్సిపల్, పంచాయితీ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ అనుమతి , బిల్డింగ్ ప్లాన్ అనుమతి లేనటువంటి స్థలాలను, భవనాలను రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తో కొత్త నిబంధనలు రిజిస్ట్రేషన్ల పై ప్రభావం చూపుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నేటి నుండి అమలులోకి ప్రభుత్వ ఉత్తర్వులు
కొనుగోలుదారులు మోసపోకుండా చూడడంతో పాటుగా నగరాలు, పట్టణాలలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది . పంచాయతీరాజ్ ,పురపాలక చట్టం నిబంధనలకు లోబడి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పని చేయాలని, అనధికార లేఔట్లకు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఈరోజునుండి ఈ ఉత్తర్వులు పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి.

రీ సేల్ అవుతున్న అనధికార స్థలాలకు నో రిజిస్ట్రేషన్
ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలనుకునే ఈ కొత్త నిబంధనలతో అక్రమాలకు చెక్ పడుతుందని భావిస్తున్నా రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో ఉన్న ప్లాట్ లే ఎక్కువగా ఉండడంతో దీని ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖ పై ఎక్కువగా పడుతుందని ఒక అంచనా.
లేఅవుట్ అనుమతి, ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్లను ,క్రమబద్దీకరణ చేసుకున్న భవనాలు, నిర్మాణాలను, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలలో ఆమోదించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని మార్గదర్శకాలను విడుదల చేయటంతో ఇప్పటి వరకు రీ సేల్ అవుతున్న అనధికార స్థలాలు రిజిస్ట్రేషన్ కావు.

రిజిస్ట్రేషన్ శాఖపై తీవ్ర ప్రభావం పడే అవకాశం .. ఈ జిల్లాలలో అధికంగా ..
ఏమాత్రం డీవియేషన్ ఉన్నా రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం . ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది తెలంగాణ ప్రభుత్వం.
అనధికార, అక్రమ లేఅవుట్ల నిరోధక చట్టం 2015 ప్రకారం అక్రమ లేఅవుట్లు ,ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలి. అలా కాకుంటే వాటిని రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాలో చేరుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్,మల్కాజ్గిరి, రంగారెడ్డి, మేడ్చల్ ,యాదాద్రి భువనగిరి వికారాబాద్, వరంగల్ అర్బన్ , వరంగల్ రూరల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలను రిజిస్ట్రేషన్ లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video

నిబంధనలు తెలీకుండా కొనుగోలు చేసిన మధ్యతరగతి వారికీ ఇబ్బందే !!
కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఇప్పటికే 1200 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల రాబడిని కోల్పోయింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు తాజా నిర్ణయంతో రిజిస్ట్రేషన్ల శాఖకు మరింత నష్టం వచ్చే అవకాశం ఉంది. అక్రమాల నిరోధానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా , అక్రమార్కుల మాట అటుంచి ఇప్పటికే ఈ నిబంధనలు తెలీకుండా స్థలాలను కొనుగోలు చేసుకున్న మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది .












Click it and Unblock the Notifications