జర్మన్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
న్యూఢిల్లీ/హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై కేంద్ర హోంశాఖ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉందని హోంశాఖ అఫిడవిట్లో పేర్కొంది.
ఈ పిటిషన్పై త్వరగా విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది రవికిరణ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఆ పిటిషన్ను బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.
చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతోందంటూ గతంలో కేంద్ర హోంశాఖ హైకోర్టుకు వివరాలను మెమో రూపంలో సమర్పించింది. మెమో రూపంలో వివరాలు సమర్పించడాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా, గత 10 సంవత్సరాలుగా జర్మన్ పౌరుడడు భారత చట్ట సభల్లో సభ్యుడిగా ఉన్న అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు. చెన్నమనేనిపై అనర్హత వేటు ఖాయమని ఆయన భావిస్తున్నారు.
కాగా, ఇటీవల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తనకు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్లని వ్యాఖ్యానించడంపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇక్కడకు రాన్నట్లేనని ప్రజలకు సంకేతాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.