విషాదం : హైదరాబాద్లో కరోనాతో హెడ్ నర్సు మృతి... 4 రోజుల్లో రిటైర్మెంట్..
హైదరాబాద్లో కరోనా వైరస్ సోకిన ఛాతి ఆస్పత్రి హెడ్ నర్సు ఒకరు శుక్రవారం(జూన్ 26) మృతి చెందారు. గాంధీలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఈ నెల 30వ తేదీన రిటైర్ కావాల్సిన ఆమె... ఇంతలోనే కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో విషాదం నింపింది.
హెడ్ నర్సుగా ఛాతీ ఆస్పత్రిలో ఆమె కరోనా పేషెంట్లకు చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమె కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందారు. ఆ హెడ్ నర్సుకు కరోనా సోకిన కొద్దిరోజులకు ఆమె భర్తకు కూడా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆయన కరోనా ట్రీట్మెంట్ పొందుతున్నారు.
అటు పోలీస్ శాఖను కూడా కరోనా వైరస్ భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ముగ్గురు పోలీసులు కరోనాతో మృతి చెందారు. ఇందులో ఒక కానిస్టేబుల్,ఒక హోంగార్డు,ఒక ఏఎస్ఐ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ముగ్గురు ఐపీఎస్లు సహా దాదాపు 200 మంది పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. తొలి విడతలో అధికంగా కేసులున్న స్టేషన్లను డిస్ ఇన్ఫెక్షన్ టీమ్లు శుభ్రం చేస్తున్నాయి.రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లను శానిటైజ్ చేసే అవకాశం ఉంది.
ఇక కేసుల విషయానికొస్తే... రాష్ట్రంలో ఇప్పటివరకూ 11,364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 230 మంది మృతి చెందారు. గురువారం(జూన్ 25) కొత్తగా మరో 920 కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజూ నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండటం గమనార్హం.