బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం భూపేశ్ బఘేల్: కరీంనగర్ సభలో నేతలు ఏకిపారేశారు
కరీంనగర్: బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా కరీంనగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మోడల్ అంటే పేదల అభివృద్ధి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీనియర్ నేతలు వీహెచ్, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రమైతే వచ్చింది కానీ.. రైతులకు మద్దతు ధర లభించిందా? అని బఘేల్ ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావు, కవితకు ఉద్యోగాలు దిరికాయి కానీ.. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు లభించాయా? అని అన్నారు. ఛత్తీస్గఢ్లో రైతు రుణ మాఫీ చేశామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిగా రూ. 2500 చొప్పున అందిస్తున్నామని సీఎం భూపేశ్ బఘేల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను బలోపేతం చేస్తుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్వేషాలు రెచ్చగొట్టి బలహీన పరుస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ మోడల్ అంటే పేదల అభివృద్ధి.. గుజరాత్ మోడల్ అంటే బీజేపీ అభివృద్ధి అని బఘేల్ వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తుందో ఆ పార్టీని ఆదరించాలన్నారు. మీ విలువైన ఓటు కాంగ్రెస్ పార్టీకే వేసి బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.
కరీంనగర్ ఆహ్వానం పలికిన తరుణం - మార్పుకోసం సిద్ధం అయిన తెలంగాణ#YatraForChange
— Telangana Congress (@INCTelangana) March 9, 2023
#HaathSeHaathJodo #ChaloKarimnagar pic.twitter.com/hxZzgMnEht
ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని రేవంత్ చెప్పారు. అంతేగాక, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులు భారీగా పెరిగాయన్నారు. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీకి ఓట్లు అడిగే హక్కులేదన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీవైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లేనని అన్నారు. ఇక పార్టీ నేతలు జైరాం రమేష్, భట్టి విక్రమార్క, సీతక్క తదితర నేతలు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications