మెగాస్టార్ చిరంజీవి ఆపన్నహస్తం- సినీ కార్మికులు, జర్నలిస్టులకు ఉచిత వ్యాక్సినేషన్
తెలుగు రాష్ట్రాల్లో కల్లోలం రేపుతున్న కరోనా వైరస్పై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినీ కార్మికులతోపాటు జర్నలిస్టులకు సైతం వ్యాక్సిన్లు వేయించేందుకు ముందుకొచ్చారు. ఈ వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తామని తాజాగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. దీంతో చిరంజీవి వ్యాక్సిన్ సాయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్వంలో నడుస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) తరపున కష్టాల్లో ఉన్న సినీ రంగ కార్మికులకు వ్యాక్సిన్లు వేయించేందుకు ఆయన ముందుకొచ్చారు. అపోలో ఆస్పత్రి సాయంతో సినీ కార్మికులకు త్వరలో ఉచిత వ్యాక్సిన్లు వేయించబోతున్నట్లు చిరు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్లో చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఆయన సినీ కార్మికులు తమ అసోసియేషన్ల ద్వారా వ్యాక్సిన్ల కోసం పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్ 22న ప్రారంభమయ్యే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తారు. సినీ కార్మికుల కుటుంబ సభ్యులకూ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
కరోనా సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవితో పాటు తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు నటీనటులు కలిసి ఈ కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించారు. ఇందుకోసం నటీనటులంతా భారీగా విరాళాలు కూడా పోగు చేశారు. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వమే వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ కూడా వేచి చూస్తోంది. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంతో పాటు వ్యాక్సిన్లు బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి వస్తుండటంతో ముందుగా సినీ కార్మికులకు, ఆ తర్వాత జర్నలిస్టులకు ఉచితంగా వ్యాక్సినేషన్ చేయించాలని చిరంజీవి నిర్ణయించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021