క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు టార్గెట్.. మీకే ఈ హెచ్చరిక!
సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ మాట అటు ఉంచి సైబర్ నేరాలను కట్టడి చేయడం పోలీసులకు పెద్ద పనిగా మారిపోయింది. ఏమాత్రం చిన్న అవకాశం దొరికిన సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పండుగలు పబ్బాలను కూడా వదలకుండా టార్గెట్ చేస్తున్నారు.
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల వార్నింగ్
తాజాగా త్వరలో రాబోతున్న క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అమాయకులను మోసం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. క్రిస్మస్ నూతన సంవత్సర గిఫ్ట్ లు, విదేశీ లాటరీలు, క్యాష్ బ్యాక్ గెలిచారని మెసేజ్ లు పంపిస్తూ ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలని వ్యక్తిగత వివరాలను అడుగుతున్నారు.

వైబ్ సైట్లు, సోషల్ మీడియాలో పాస్ లు, లాటరీలు, బహుమతులు
మీరు ఈ పండుగ ఆఫర్ లో బోలెడన్ని బహుమతులు గెలుచుకున్నారు అని, మీకు ఒక్కసారిగా లక్షల రూపాయల డబ్బు లాటరీలో రాబోతుందని చెప్పి నమ్మబలుకుతున్నారు. ఈ విధమైన మోసాలే కాదు.. న్యూ ఇయర్ పార్టీలు, ఈవెంట్లు, పబ్ లు, రిసార్ట్ లకు నకిలీ పాసులను, వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా పేజీల ద్వారా అమ్ముతున్నారు.
హాలీడే ప్యాకేజీలు, న్యూ ఇయర్ ఆఫర్లు
ఆకర్షణీయమైన హాలిడే ప్యాకేజీలు ఉన్నాయని, తీర్థయాత్రలు, క్రూయిస్ టూర్లు ఉన్నాయని, ఇంటర్నేషనల్ టూర్స్ కూడా తక్కువ ధరలకే ఉన్నాయని ప్రచారం చేసుకుంటారు. ముందస్తు చెల్లింపులు చేయించుకున్న తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా తప్పించుకుంటున్నారు. అందుకే తక్కువ ధరకు న్యూ ఇయర్ ఆఫర్లు ఉన్నాయని నమ్మి ఎవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా పేజ్ లతో మోసం.. జాగ్రత్త
నకిలీ హోటల్ వెబ్సైట్ పేజీలు, సోషల్ మీడియా పేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని, ఇలా ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని చెబుతున్నారు. క్రిస్మస్ ఈవెంట్స్, న్యూ ఇయర్ ఈవెంట్స్ పేరుతో వచ్చే వాట్సాప్ సందేశాలకు రెస్పాండ్ కావద్దని సూచిస్తున్నారు. మోసపోయే వాళ్ళు ఉన్నప్పుడే మోసం చేసేవారు ఉంటారని, ప్రజలు ఈ సైబర్ నేరాల పైన అవగాహన తోటి వ్యవహరించాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications