పరిటాల సిద్దార్థ బ్యాగ్లో బుల్లెట్... శంషాబాద్ ఎయిర్పోర్టులో గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది...
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో బుల్లెట్ కలకలం రేపింది. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ బ్యాగ్లో బుల్లెట్ బయటపడింది.స్నేహితులతో కలిసి శ్రీనగర్కు వెళ్లేందుకు పరిటాల సిద్ధార్ధ్ బుధవారం(ఆగస్టు 18) ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో సిద్దార్థ బ్యాగ్లో 5.5 ఎంఎం బుల్లెట్ను గుర్తించారు. అనంతరం ఆ బుల్లెట్ను ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని పరిటాల సిద్ధార్ధ్కు ఎయిర్ పోర్ట్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
పరిటాల సిద్దార్థ వివాహం గతేడాది తేజస్వినితో జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక అభిమాన ఘనం ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబాన్ని అభిమానించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా అభిమానులు వారితోనే ఉంటారు. పరిటాల రవి హత్య అనంతరం.. ఆయన భార్య సునీత రాజకీయాల్లో రాణిస్తున్నారంటే ఆ అభిమానులే కారణమని చెబుతుంటారు. గతేడాది నవంబర్లో పరిటాల శ్రీరామ్కు కుమారుడు జన్మించగా.. ఆ చిన్నారికి తండ్రి పరిటాల రవీంద్ర పేరు పెట్టారు.
Recommended Video
గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్ను వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల పరిటాల శ్రీరామ్ టీడీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.