జనం నవ్వుతున్నారు కేసీఆర్!: క్లౌడ్ బరస్ట్పై కీలక విషయాలు చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: విదేశీ కుట్రలో భాగంగానే క్లౌడ్ బరస్ట్ సంభవించిందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ పై కేసీఆర్ మరింత స్పష్టమైన సమాచారంతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. క్లౌడ్ బరస్ట్ అనేది కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుందన్నారు. దీనిపై ఆయన ప్రజేంటేషన్ కూడా ఇచ్చారు.
Recommended Video
ఎవరి కుట్ర ఉందో చెప్పండి కేసీఆర్ అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
క్లౌడ్ బరస్ట్ వల్ల రోజంతా వర్షం పడదని, కేవలం కొన్ని గంటలు మాత్రమే కురుస్తుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. క్లౌడ్ బరస్ట్ ఎక్కడ పడితే అక్కడ పడదని, అది కేవలం కొంత ప్రాంతానికే పరిమితమవుతుందని చెప్పారు. క్లౌడ్ బరస్ట్ ఎలా జరిగింది? అందులో ఏ దేశం కుట్ర ఉందో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డిడిమాండ్ చేశారు. చైనా, పాకిస్తాన్ దేశం కుట్ర పన్నిందా ..? అనేది స్పష్టం చేయాలన్నారు.
క్లౌడ్ బరస్ట్ చేయాలంటే సీక్రెట్ ఎయిర్ బేస్ ఉండాలి
రాకెట్స్, విమానం ద్వారా క్లౌడ్ బరస్ట్ చేయాలంటే వాళ్లకు భారతదేశంలో సీక్రెట్ ఎయిర్ బేస్ ఉండాలని.. అదెక్కడ ఉందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 'సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుతో వరదను నివారించవచ్చన్నారు. వరదలతోనే కాళేశ్వరం పంప్హౌస్ మునిగిపోయింది. కాళేశ్వరం ఆకృతి తప్పు.. రిజర్వాయర్లు కట్టలేదు' అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వరదల వల్ల నష్టపోయిన బాధితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
కాళేశ్వరం వరదలపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్న విశ్వేశర్ రెడ్డి
గతంలో ఇచ్చిన మాటలకు విలువ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. భద్రాచలం దేవాలయానికి గతంలో రూ.100కోట్లు ఇస్తామని.. ఇప్పుడు దానికి సున్నా కలిసి రూ.1000కోట్లు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీలో వరదలొచ్చినప్పుడు బాధితులకు రూ.10వేలు ఇస్తామని ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్ తప్పని.. రిజర్వాయర్లు ఎక్కడా కట్టలేదని.. నీళ్లు ఎక్కడ ఎత్తిపోస్తారని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వరదను నివారించవచ్చన్న కేసీఆర్.. ఇప్పుడు పంప్హౌస్ మునిగిపోవడంపై సమాధానం చెప్పాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.