దసరా కానుకగా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్; రేపు ప్రారంభం.. మెనూ ఇదే!!
తెలంగాణా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలపై ఫోకస్ పెడుతున్నారు. ప్రజాసంక్షేమంలో దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి రేపటి నుండి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దసరా కానుకగా అక్టోబర్ ఆరవ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో అన్ని తరగతుల వారికి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అందించనుంది. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారాన్ని అందించటానికి కెసిఆర్ ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం మెనూ ఖరారయింది.

ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్ లో ప్రారంభించనున్నారు. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల 147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే, అల్పాహారాన్ని ఇవ్వనున్నారు.
ఇక ఈ మెనూ విషయానికి వస్తే సోమవారం నాడు ఇడ్లీ సాంబార్ లేదా చట్నీతో గోధుమ రవ్వ ఉప్మా పెట్టనున్నారు. మంగళవారం నాడు పూరి ఆలు కుర్మా లేదా చట్నీతో రవ్వ టమాటా బాత్ పెట్టనున్నారు. బుధవారం నాడు ఉప్మా, సాంబార్, లేదా కిచిడి, చట్నీ పెట్టనున్నారు. గురువారం నాడు మిల్లెట్ ఇడ్లీ సాంబార్ లేదా పొంగల్ సాంబార్ పెట్టనున్నారు.
శుక్రవారం నాడు ఉగ్గాని లేదా పోహా లేదా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడి, చట్నీ పెట్టనున్నారు. శనివారంనాడు పొంగల్, సాంబార్ లేదా వెజిటబుల్ పలావ్, ఆలూ కుర్మా, రైతా పెట్టనున్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని పాఠశాలలో పాఠశాల ప్రారంభ సమయం కంటే ముప్పావు గంట ముందు అందించనున్నారు.












Click it and Unblock the Notifications