కేసీఆర్ సచివాలయ స్వప్నానికి 'ఖేల్ ఖతం': జింఖానా క్రీడాకారుల ఆవేదన.
ఒకవిధంగా హైదరాబాద్ క్రికెటర్స్ అందరూ జింఖానా మైదానం నుంచే తమ కెరీర్ ను ప్రారంభించారు. దేశం తరుపున ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది క్రికెటర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసినవారే. ఒక్క హైదరాబాదీ క్రికెటర్లు మాత్
హైదరాబాద్: జింఖానా మైదానంలో సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దెబ్బకు 150సంవత్సరాల చరిత్ర కలిగిన జింఖానా గ్రౌండ్ కనుమరగయ్యే ప్రమాదం ఉండగా.. నగరానికి చెందిన వందల మంది క్రీడాకారుల కలలు కూడా కల్లలుగానే మిగిలిపోనున్నాయి.
కొత్త రాష్ట్రంలో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకంగా ఉండాల్సింది పోయి.. సామాన్య క్రీడాకారులకు అందుబాటులో ఉన్న ఒక్క మైదానాన్ని కూడా నిర్మాణాల కోసం వాడుకోవడం సమంజసం కాదని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చిన్న చిన్న క్రీడాకారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు.
కెరీర్కు దెబ్బే:
కాగా, ప్రతీ నిత్యం వందలమంది క్రీడాకారులు జింఖానా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంటారు. క్రికెట్, ఫుట్ బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, టెన్నిస్, రోలర్ స్కేటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్.. ఇలా తదితర క్రీడాకారులంతా తమ నైపుణ్యానికి పదును పెడుతుంటారు. ఇప్పుడు ఈ మైదానంలో నిర్మాణాలు చేపట్టడం ద్వారా క్రీడాకారుల కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.
కేవలం ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని నిర్మాణాలను చేపట్టడం కోసం.. ఏళ్లుగా హైదరాబాదీలకు వారసత్వంగా వస్తున్న చారిత్రక ప్రదేశాన్ని కనుమరుగు చేయడం సరికాదన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పీఆర్ మాన్ సింగ్. 1983లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ నెగ్గిన సమయంలో ఈయన జట్టు మేనేజర్ కూడా వ్యవహరించారు.
హైదరాబాదీ క్రికెటర్ల అడ్డా:
ఒకవిధంగా హైదరాబాద్ క్రికెటర్స్ అందరూ జింఖానా మైదానం నుంచే తమ కెరీర్ ను ప్రారంభించారు. దేశం తరుపున ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది క్రికెటర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేసినవారే. ఒక్క హైదరాబాదీ క్రికెటర్లు మాత్రమే గాక, దేశంలోని అగ్రశ్రేణి క్రీడాకారులు సైతం ఇక్కడ ప్రాక్టీస్ చేసేవారు. ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ 'మొయిన్ ఉద్ దౌలా గోల్డ్ కప్'లో పాల్గొనడం కోసం వారంతా జింఖానాకు వచ్చేవారు.
బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఆవేదన:
ఒక్క క్రికెట్ మాత్రమే గాక బాస్కెట్ బాల్, రోలర్ స్కేటింగ్ లకు జింఖానా మైదానం పేరు గాంచింది. నగరం మొత్తంలో బాస్కట్ బాల్, రోలర్ స్కేటింగ్ లకు జింఖానా మాత్రమే అనువుగా ఉంటుందని చెబుతున్నారు. ఇక వైఎంసీఏలో ఒక బాస్కెట్ బాల్ కోర్టు ఉన్నప్పటికీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అది కూడా పోయే అవకాశం ఉంది. మారెడ్ పల్లిలో జీహెచ్ఎంసీకి సంబంధించిన రెండు కోర్టులు ఉన్నప్పటికీ.. వాటి ఆకారం సరిగా లేక బాస్కెట్ బాల్ ప్లేయర్స్ అటువైపు వెళ్లడం లేదు.
దీంతో భవిష్యత్తులో బాస్కెట్ బాల్ ప్లేయర్స్ భవిష్యత్తేంటని తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ నార్మన్ ఇసాక్ ప్రశ్నించారు. ఎల్బీనగర్ లో బాస్కెట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరితే నిరాకరించారని, ఇప్పుడు జింఖానా కూడా పోతే.. తామెక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వీటిని విస్మరిస్తే.. మెల్లిగా ఈ క్రీడలే కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.
రోలర్ స్కేటింగ్కు కీలకంగా జింఖానా
ఇక రోలర్ స్కేటింగ్ క్రీడాకారులు కూడా ఇదే తరహాలో ఆవేదన చెందుతున్నారు. మొత్తం సికింద్రాబాద్ పరిధిలో జింఖానా మైదానం మాత్రమే తమకు అనువుగా ఉందని, ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ఆటపై మక్కువ చూపుతున్న చిన్నారుల కెరీర్ కు ఆదిలోనే బ్రేక్ వేసినట్లు అవుతుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం నగర శివారు ప్రాంతాల్లో స్థలం కేటాయించినా.. అంత దూరం చిన్నారులు వెళ్లలేరు అని గుర్తుచేస్తున్నారు.
ప్రతీ ఏటా 200మంది యంగ్ చిల్డ్రన్ రోలర్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇలాంటి సమయంలో జింఖానా మైదానం లేకపోతే.. వారి కెరీర్ దెబ్బతింటుందని ఇంటర్నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ మరియు అర్జున అవార్డు గ్రహీత అనూప్ ఈ విషయం వెల్లడించారు. ఫుట్ బాల్, హాకీ క్రీడాకారులు సైతం జింఖానా మైదానం ఉండాల్సిందేనంటున్నారు. కేవలం క్రీడలను బ్రతికించుకోవడానికే కాక గత కాలపు మేటి క్రీడాకారుల గుర్తుగా ఇది నిలిచిపోతుందన్నారు.