దావోస్ వేదికగా సీఎం జగన్, మంత్రి కేటీఆర్ భేటీ; ఇక్కడ వివాదం; అక్కడ ఆసక్తికర పరిణామం!!
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ సదస్సులో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇరువురు నేతలు రెండు రాష్ట్రాలలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అక్కడకు వచ్చిన పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల ఆకర్షణకు పోటీ పడుతున్నారు.
దావోస్ సమ్మిట్ లో ఆసక్తికర పరిణామం .. జగన్, కేటీఆర్ ల భేటీ
దావోస్ సమ్మిట్ లో ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. ఇక తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దావోస్ లో సీఎం జగన్ , మంత్రి కేటీఆర్ కలుసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య అనేక అంశాలలో విభేదాలు ఉన్నా, రెండు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతున్నా, ఆర్టీసీ ఆస్తుల పంపకం విషయంలో, తెలుగు అకాడమీ ఆస్తుల వారి విషయంలో విభజన పంచాయతీలు ఉన్నా సీఎం జగన్, మంత్రి కేటీఆర్ లు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. రాష్ట్రాల పెట్టుబడులపై ఇద్దరూ చర్చించుకున్నారు.

సోదరుడు జగన్ తో గొప్ప సమావేశం జరిగిందన్న మంత్రి కేటీఆర్
ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి తో కలిసి ఉన్న ఫోటోలు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ నా సోదరుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో గొప్ప సమావేశం జరిగింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి కేటీఆర్ తో భేటీ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన అంతర్జాతీయ కంపెనీలు ఇవేనని కూడా ఆయన పోస్ట్ చేశారు. ప్రముఖ బీమా సంస్థ - స్విస్ రీ, ఈకామర్స్ సంస్థ- మీషో, స్పానిష్ఫార్మా కంపెనీ - కీమోమరియు లూలు గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ గా ఉన్నాయి అని తెలిపారు.

ఇటీవల ఏపీపై కేటీఆర్ వ్యాఖ్యలు.. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం
ఇదిలా ఉంటే ఇటీవల క్రెడాయ్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఏపీలో కరెంటు, నీళ్లు లేవని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏపీలో మంత్రుల నుండి కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. కేటీఆర్ ఏపీకి వచ్చి చూస్తే ఏపీ ఎలా ఉందో కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత దావోస్ లో జగన్, కేటీఆర్ భేటీపై ఆసక్తి
తన వ్యాఖ్యలు పక్క రాష్ట్రంలోని సన్నిహితులకు బాధ కలిగించి ఉండొచ్చు అని పేర్కొన్న కేటీఆర్ తన వ్యాఖ్యల వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని, ఎవరినో బాధపెట్టాలని ఎవరైనా కించపరచాలని తాను వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు సోదర సమానుడు భావిస్తానని తెలిపిన ఆయన జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ప్రస్తుతం దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్ కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.












Click it and Unblock the Notifications