కల్వకుంట్ల కవితను టార్గెట్ ను చేసిన బీజేపీ - ఫోన్లపై నిఘా..!!
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ పొలిటికల్ వార్ పీక్ కు చేరింది. ఇప్పటి వరకు రాజకీయ విమర్శలకే పరిమిమైన ఈ యుద్దం..అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత లక్ష్యంగా వ్యూహాలు అమలుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ విషయాలను పార్టీ నేతల సమావేశంలో వెల్లడించారు.
నేరుగా కవితనే పార్టీ మారాలని కోరారు
తన బిడ్డ కవితను పార్టీ మారాలని బీజేపీ వాళ్లు అడిగారంటూ సీఎం కేసీఆర్ సంచలన అంశాలను బయట పెట్టారు. పార్టీ నేతల ఫోన్ల పైన నిఘా ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పార్టీ మరతారా అని ఎవరైనా అడిగితే గట్టిగా సమాధానం చెప్పాలని సూచించారు. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలపై ఈడీ దాడులుంటాయని కేసీఆర్ పార్టీ నేతలను అలర్ట్ చేసారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసారు. ధర్మంగా, న్యాయబద్ధంగా ఉన్నామని చెప్పారు. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ఈడీ అనేక కేసులు పెట్టిందని.. ఇప్పటి వరకూ ఒక్క కేసునూ నిరూపించలేకపోయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. కవితను పార్టీ మారాలని అడిగిన బీజేపీ నేతల పైన ఇక యుద్దమేనని కేసీఆర్ ప్రకటించారు.

రాజీ లేదు ..ఇక పోరాటమే
బీజేపీ ఒకటి అంటే..మనం నాలుగు మాటలతో సమాధానం చెప్పాలని నిర్దేశించారు. పార్టీ మారాలంటూ ఢిల్లీలో ఆప్ మంత్రి సిసోడియాను ఏకంగా ఈడీ అధికారులే అడిగిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ కావాలని బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి ముందస్తు హెచ్చరిక చేసారు. భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. మునుగోడులో ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టారని దానిని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో త్వరలోనే కొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. బీజేపీ చేస్తున్న వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే చరమ గీతం పాడదామని చెప్పారు.
నేతల ఫోన్లపై నిఘా ఉందంటూ
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయబద్ధంగా పోరాటం చేద్దామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. అయితే, కవిత ను పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు కోరారని కేసీఆర్ చెప్పటం ఇప్పడు రాజకీయ సంచనలంగా మారింది. నేరుగా కేసీఆర్ కుమార్తెనే పార్టీ మారమని కోరిన బీజేపీ నేతలు ఎవరనే చర్చ మొదలైంది. ఇక, పార్టీ నేతల ఫోన్ల పైన నిఘా ఉందని స్వయంగా సీఎం చెప్పటంతో..ఇప్పుడు పార్టీ నేతలు అప్రమత్తం అవుతున్నారు. మరో పది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంో.. ఈ రాజకీయ యుద్దం మరిన్ని ఆసక్తి కర మలుపులు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications