కేసీఆర్ డిసైడ్ అయ్యారు - సీఎం పదవిపైనా క్లారిటీ : గులాబీ బాస్ లెక్క పక్కా..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ అయిపోయారు. కొత్త పార్టీతో జాతీయ రాజకీయాల్లో కొత్త పాత్రకు సిద్దమయ్యారు. అందుకు ముహూర్తం సైతం దాదాపు ఫిక్స్ అయిపోయింది. రాష్ట్రపతి ఎన్నికల నుంచే తన వ్యూహాలు అమలు చేయబోతున్నారు. అయితే, సీఎం జాతీయ రాజకీయాల్లో కి ఎంట్రీ ఇస్తే..తెలంగాణ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారా..దీనికి కేసీఆర్ వ్యూహం ఏంటి. ఎలా ముందుడుగు వేయబోతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ తో పాటుగా అందరిలోనూ ఆసక్తి కర చర్చకు కారణమైంది. కానీ, జాతీయ రాజకీయాలపైన గత ఆరు నెలలకు పైగా ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్..పక్కా వ్యూహంతో కదలుతున్నారు.

సీఎంగా కేసీఆర్ కంటిన్యూ - క్లారిటీ
అనేక చర్చలు ..సలహాలు..సంప్రదింపులతో పక్కా లెక్కలతో నిర్ణయం ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా..తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగనున్నారు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎంగానే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 19న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరోసారి దీని పైన చర్చించి అందరి ఆమోద యోగ్యంతో నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటింగ్ చేయటం పైన దాదాపు నిర్ణయానికి వచ్చింది. అయితే, అభ్యర్ది విషయంలో ఎన్డీఏ ఏం చేయబోతున్నది..ఎవరిని ప్రతిపాదించేది తెలిసిన తరువాతనే కేసీఆర్ తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

సుదీర్ఘ కసరత్తు - వ్యూహాలతో ముందుకు
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలు.. వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..పార్లమెంట్ ఎన్నికల వరకు తాను ఏ రకంగా వ్యవహరించాలని.. ఎలా ముందుకు వెళ్లాలి... ఎవరితో కలిసి వెళ్లాలనే దాని పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా.. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే..తన జాతీయ పార్టీ ప్రతిపాదన అంశాన్ని సహచర మంత్రులతో షేర్ చేసుకున్నారు. ఇక, 19వ తేదీన సమావేశంలో దీని పైన అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రకు సిద్దమయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ధులు ఎవరనేది అటు ఎన్డీఏ - ఇటు కాంగ్రెస్ నుంచి క్లారిటీ వచ్చిన తరువాత మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ రోల్ పైన క్లారిటీ రానుంది.

అసలు టార్గెట్ అదే.. హైదరాబాద్ టు ఢిల్లీ
రాష్ట్రపతి ఎన్నిక నుంచే ఎన్డీఏకు షాక్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నా.. దీని కంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా దీర్ఘ కాలిక వ్యూహంతో కేసీఆర్ తన ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఇదే అంశం పైన పలు పార్టీల నేతలు..వారి ఆలోచనలు.. కలిసి పని చేసే అంశం పైన స్పష్టత తీసుకున్న తరువాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో హ్యాట్రిక్ విజయం పైనా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ గెలిచి..ఢిల్లీలోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే, తెలంగాణలో తాము బలోపేతం అవుతున్నామనే మైండ్ గేమ్ తో బీజేపీ..కేసీఆర్ ను తెలంగాణకు పరిమితం చేయాలని భావిస్తోంది. దీంతో..హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ జాతీయ సమావేశాల కంటే ముందుగానే తన జాతీయ అజెండా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. దీంతో..ఇక, కేసీఆర్ వేసే ప్రతీ అడుగు..రాజకీయంగా ఆసక్తి కరంగా మారనుంది.












Click it and Unblock the Notifications