ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి... వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు...
తెలంగాణ వైద్యారోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల దేశంలోని పలు ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలిచ్చారు. అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యుద్ధ విమానాల ద్వారా రాష్ట్రానికి తరలించే ఆక్సిజన్ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులకు అందేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా టెస్టు కిట్ల కొరత లేకుండా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు తెలిపారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న అందరికీ కిట్స్ అందించాలని స్పష్టం చేశారు.
మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజలు కూడా కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విజయ్ వల్లభ్ అనే కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు చెలరేగి 13 మంది కరోనా పేషెంట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొందరు పేషెంట్లు గాయాలపాలయ్యారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉన్న ఓ ఆస్పత్రిలోనూ వారం రోజుల క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కరోనా పేషెంట్లు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల కరోనా బారినపడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం హోం ఐసోలేషన్లో కోలుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు శుక్రవారం(ఏప్రిల్ 23) బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు బయల్దేరి వెళ్లాయి.ఈ యుద్ధ విమానాల్లోని 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు తరలించనున్నారు. యుద్ధ విమానాలను ఉపయోగించడం ద్వారా మూడు రోజుల సమయం ఆదా అవడంతో పాటు, ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఇది దోహదపడనుంది.