మహాత్ముడి అహింసా పంథానే తెలంగాణకు స్పూర్తి... : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవంలో కేసీఆర్
భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకునే గొప్ప అవకాశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ద్వారా కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మగాంధీ పాత్రను కొనియాడారు.దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీకి ముందు.. గాంధీ తర్వాత అని పేర్కొనవచ్చు అన్నారు. మహాత్ముడు ఉద్యమంలో కాలుమోపక ముందే ఎంతో మంది పోరాట పంథాను ఎంచుకున్నప్పటికీ... గాంధీ ఉద్యమానికి నేతృత్వం వహించిన తర్వాతే అసలైన స్పూర్తి రగిలిందన్నారు. శుక్రవారం(మార్చి 12) హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో 'ఆజాదీ కా అమృత్ మమోత్సవ్' వేడుకలను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
మహాత్ముడి అహింసా పంథానే స్పూర్తి...
'ఆజాదీ కా అమృత్ మమోత్సవ్' వేడుకల ప్రారంభంలో భాగంగా జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల కోసం నియమించిన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కేవీ రమణాచారి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి మహాత్మగాంధే స్పూర్తి అని అన్నారు. మహాత్ముడి అహింసాపూరిత స్వాతంత్య్ర ఉద్యమ పంథానే తెలంగాణ ఉద్యమానికి స్పూర్తిగా నిలిచిందన్నారు. అహింసా పద్దతిలో గాంధీ ఉద్యమం ప్రారంభించినప్పుడు కొంతమంది ఉద్రేకపరులు నిరాశ చెందారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఇదే జరిగిందని అన్నారు.
రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని...
గాంధీ నేత్రుత్వంలోనే చివరకు దేశానికి స్వాతంత్య్రం సిద్దించి ఇప్పుడు మనం స్వేఛ్చా వాయువులు పీల్చుకునేందుకు కారణమైందని అన్నారు. అదే తరహాలో,అదే పంథాలో తెలంగాణ ఉద్యమం కూడా గొప్ప విజయం సాధించిందన్నారు. 75 వారాల పాటు సాగే 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.ప్రపంచానికే ఉద్యమ పంథాను నేర్పిన దేశ స్వాతంత్య్రోద్యమ ఔన్నత్యాన్ని మరోసారి మననం చేసుకుని ముందుకు సాగాలన్నారు. గాంధీజీ సిద్ధాంతాలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తి దాయకం అన్నారు. 75 వారాల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
గుజరాత్లో ప్రారంభించిన ప్రధాని మోదీ...
వచ్చే ఏడాది (2022) ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం.. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు ఈ మహోత్సవం సాగనున్నది.శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో (మార్చి 12) ప్రధాని నరేంద్ర మోదీ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రామానికి సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించారు.ఈ వేడుకల నిర్వహణ కోసం జాతీయ స్థాయిలో 259 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు.