తెలంగాణకు రావాలంటూ ఆహ్వానం: ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీని ఆయన ఆహ్వానించారు.
తాగు నీటి ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సమస్యగా మారిన హైకోర్టు విభజనపై త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం ఇతోధకంగా నిధులు ఇవ్వాలని కోరారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులివ్వాలని కోరారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలో ద్వారా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని ఆయన ప్రధాని మోడీతో చర్చించారు. దీంతో పాటు తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పలు అంశాలపై జోక్యం చేసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీతో కేసీఆర్ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భేటీ అయ్యారు. సోమవారం ఆయన జైట్లీని కలిసి రాష్ట్రంలోని సమస్యలను వివరించారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈమేరకు వినతి పత్రం అందజేశారు.
అంతక ముందు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అరుణ్ జైట్లీని కలిసిన వారిలో సీఎం కేసీఆర్తోపాటు ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
సాగర్లో వినాయక నిమజ్జనం ఉండదు: హైకోర్టుకు తేల్చిచెప్పిన కేసీఆర్ ప్రభుత్వం
ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం ఉండదని కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వినాయక విగ్రహాల నిమజ్జనంపై కోర్టులో విచారణ జరుగగా, నిమజ్జన ప్రక్రియను ప్రత్యేక చెరువుల్లో మాత్రమే చేపడతామని స్పష్టం చేసింది. నిమజ్జనానికి హుసేన్ సాగర్ను వాడబోమని తేల్చి చెప్పింది.
ప్రత్యామ్నాయాలను ఇప్పటికే గుర్తించామని, ఈ మేరకు నిమజ్జనం ఊరేగింపు మార్గాలను ఎక్కడివక్కడ మార్చనున్నామని పేర్కొంది. ప్రత్యేక చెరువులను గుర్తించామని, అక్కడ కూడా నిమజ్జనం తరువాత వ్యర్థాల తొలగింపును శరవేగంగా పూర్తి చేస్తామని హైకోర్టుకు తేల్చి చెప్పింది.

ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఘాటుగా స్పందించింది. సాగర్ను వాడుకోరాదని హైకోర్టు చెప్పలేదని, అన్ని చెరువుల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని సూచిస్తూ ఇచ్చిన ఆదేశాల కాపీ తన వద్ద ఉందని కమిటీ నేత భగవంతరావు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదాయప్రకారం హుస్సేన్ సాగర్లోనే ప్రధాన నిమజ్జనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఉదయం హైకోర్టులో వినాయక నిమజ్జనం కేసు వాదనకు రాగా, కేసీఆర్ ప్రభుత్వం నిమజ్జనానికి సాగర్ను వాడబోమని వెల్లడించింది.












Click it and Unblock the Notifications