పంచాయతీ నిధులపై కేంద్రంతో సీఎం కేసీఆర్ కొత్త పంచాయితీ.. మేమెందుకు అంటూ సూటిప్రశ్న!!
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీకి తెరలేపారు. కేంద్రం రాష్ట్రాల ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గ్రామ పంచాయతీలకు నిధులు ఎలా ఇస్తారంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏంటి అంటూ కేంద్ర సర్కారు తీరుపై మండిపడ్డారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పంచాయతీల ఖాతాల్లో.. మండిపడిన కేసీఆర్
దాదాపు మూడు వారాలు సైలెంట్గా ఉన్న సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైన విషయం తెలిసిందే. ఇటీవల ప్రగతి భవన్ కు చేరుకున్న ఆయన మరోమారు బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఇక ప్రగతి భవన్ కు వచ్చిన వెంటనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్ సమీక్షలో ప్రధానంగా నిధుల సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా వేస్తున్నారని కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
కేంద్ర పథకాల నిధులు పంచాయతీలకు ఇస్తామని చెప్పడం చిల్లర వ్యవహారం
పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చింది అని, పంచాయతీలపై కేంద్రం పెత్తనం చెలాయించలేదంటూ గుర్తు చేసిన కేసీఆర్, పల్లెలపై పెత్తనం సాగించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నేరుగా కేంద్ర పథకాల నిధులు పంచాయతీలకు ఇస్తామని చెప్పడం చిల్లర వ్యవహారం అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. జవహర్ రోజ్గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రం పంచాయతీలకు ఇవ్వటం ఏమిటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్ర విధానాలు
రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్ర విధానాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవటం సరైన విధానం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రం నేరుగా గ్రామాలకు నిధులు ఇవ్వడం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడిపోతుందని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు స్థానిక ప్రభుత్వానికి తెలుస్తాయని పేర్కొన్న కేసీఆర్, నిధులు ఏ మేరకు ఎక్కడ ఖర్చు పెట్టాలి అన్న విషయం స్థానిక ప్రభుత్వాలకు తప్ప కేంద్రానికి ఎలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించారు.
కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాలు రాష్ట్రాల ద్వారానే జరగాలని కేసీఆర్ సంచలన వాదన
కేంద్రం అమలు చేస్తున్న అన్ని పథకాలు రాష్ట్రాల ద్వారానే జరగాలనే సంచలన వాదనను కెసిఆర్ తెరమీదకు తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కరెంటు లేని పల్లెలు, తాగునీరు, సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలు, విద్యా, వైద్య రంగాలలో ఇంకా సాధించని ప్రగతి, ఇటు వంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలని చూడటం సరికాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రాల తీరుతోనే కేంద్రం నిర్ణయం.. ఇలా అయితే మేమెందుకు అంటూ భగ్గుమన్న కేసీఆర్
అయితే రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కేటాయించిన నిధులను సంబంధిత పనులకు కాకుండా నిధులను దారి మళ్లిస్తున్నట్లుగా అనేక రాష్ట్రాల నుండి ఆరోపణలు ఉన్నాయి. ఇక పంచాయతీల నుంచి అనేక రకాలుగా ఫిర్యాదులు రావడంతో కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనిని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి నిధులను, విధులను క్షేత్ర స్థాయిలో మానిటర్ చేయాలనుకోవడం ఏమాత్రం సమంజసం కాదని, అలా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దేనికని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర పెద్దలు ఇలాగే ముందుకు వెళ్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.