స్కూళ్ల రీఓపెన్పై వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం... ఆన్లైన్లోనే పాఠాలు...
స్కూళ్ల పున:ప్రారంభం విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జులై 1 నుంచి ఆన్లైన్ పద్దతిలోనే విద్యా బోధన చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పట్లో ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని అభిప్రాయపడ్డ సీఎం కేసీఆర్... ఆన్లైన్లోనే పాఠాలు బోధించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.రోజూ 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు.
Recommended Video
అంతకుముందు,ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ను కలిసి పాఠశాలల పున:ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. మరికొంత కాలం ఆన్లైన్ విద్యా బోధననే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రోజుకు 50 శాతం మంది ఉపాధ్యాయులతోనే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని కోరారు. అలాగే కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి బదిలీలు,ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

కాగా,వారం రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో లాక్డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం... స్కూళ్లను పున:ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అధికారులు మార్గదర్శకాలు కూడా రూపొందించారు. విద్యార్థులు స్కూల్లో ఆరు గంటల పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠాలు వినేలా ప్రతిపాదనలు రూపొందించారు.
ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు విద్యార్థులు స్కూల్లో ఉంటారని అందులో పేర్కొన్నారు. తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు ఉండాలన్న దానిపై కూడా సూచనలు చేశారు. మొదట జులై 1న 8,9,10 తరగతులకు,జులై 20న 6,7 తరగతులకు,అగస్టు 16న 3,4,5 తరగతులను ప్రారంభించాలని ప్రతిపాదించారు.
అధికారులు మార్గదర్శకాలు రూపొందించినప్పటికీ... కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్ల రీఓపెన్పై పునరాలోచనలో పడింది. హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరికొద్దిరోజులు వేచి చూసి పరిస్థితులు చక్కబడ్డ తర్వాతే స్కూళ్లను తెరవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ పద్దతిలోనే విద్యా బోధన కొనసాగించాలని తాజాగా నిర్ణయించింది.












Click it and Unblock the Notifications