గుడ్డిగా ఓటెయ్యొద్దు: గెలిపిస్తే కామారెడ్డిని బంగారుతునక చేస్తా: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఈరోజు కామారెడ్డి లో నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని పేర్కొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో కామారెడ్డి ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలోనే కామారెడ్డి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఒక బంగారు తునకగా మారుస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన కామారెడ్డిని ప్రజల చేతుల్లో పెడతానని ఆయన వెల్లడించారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్న కెసిఆర్ వాటిని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుని అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ తెలిపారు.

ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ఓటర్లకు వివరించిన కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు అంటూ హెచ్చరించారు. ఎన్నికలు వచ్చినప్పుడు గుడ్డిగా ఓటు వేయవద్దని, పోటీలో ఉన్న వ్యక్తి ఎటువంటివాడు, ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టీ ఎటువంటిది అని ఆలోచించి ఓటు వేయాలని కెసిఆర్ తెలిపారు.
ఆషామాషీగా ఓటు వేస్తే ఐదు సంవత్సరాలలో మన తలరాత అధ్వానంగా మారుతుందని ఆలోచించి ఓటు వేస్తేనే నాయకులు కాకుండా ప్రజలు గెలుస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించిన కెసిఆర్, కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని హెచ్చరించారు.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఎవరైతే ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చి 50 లక్షల రూపాయల నగదుతో పట్టుబట్టారో .. ఆ మహానుభావుడు తనపై పోటీ చేస్తాడంట అంటూ విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తికి కామారెడ్డి ప్రజలు బుద్ధి చెప్పాలని కెసిఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications