సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం: సమ్మెలో పాల్గొన్న ఆర్టీసి ఉద్యోగులపై వేటు: నో కాంప్రమైజ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె విషయం పైన తొలి నుండి సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిందే చేసారు. సమ్మె చట్ట విరుద్దమని చెబుతూ..సమ్మెలోకి వెళ్లిన ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరటానికి డెడ్ లైన్ విధించారు. కొంత మంది ఉద్యోగులు విధుల్లో చేరారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేసిన ఆర్టీసి ఉద్యోగుల పైన వేటు వేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేసారు. దీని ద్వారా ఇక..తమ మాట విని విధుల్లో ఉన్న సిబ్బంది 1200 మంది మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా కొనసాగుతారని స్పష్టం చేసారు. ఇక, జేఏసీ చర్చల ప్రసక్తే లేదని..అదే విధంగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. త్వరలో ఆర్టీసీలో కొత్త విధానం అమలవుతుందని స్పష్టం చేసారు.
సమ్మెల్లో పాల్గొన్న కార్మికులపై వేటు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ మాట బేఖాతర్ చేస్తూ సమ్మెలో పాల్గొన్న ఆర్టీసి కార్మికులపైన వేటు వేయాలని నిర్ణయించారు. తమ మాట విని విధుల్లో కొనసాగిన 1200 మంది మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో పండుగ సమయంలో సమ్మెకు దిగి మరింత నష్టం కలిగించటంతో పాటుగా ప్రజల ఇబ్బందులకు గురి చేసారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. సమ్మె ప్రారంభం విషయంలో కఠినంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి శనివారం సాయంత్రి 6 గంటల వరకు డెడ్ లైన్ విధించారు. ప్రభుత్వం విధించిన నిర్దేశిత సమయం లోగా విధులకు హాజరు కాని వారిని ఆర్టీసి ఉద్యోగులుగా పరిగణించమంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అదే నిర్ణయం ప్రకటించారు.
చర్చలు లేవు..విలీనం ప్రసక్తే లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నంత పని చేసారు. తమ మాట వినని ఆర్టీసి సంఘాలతో ఇక చర్చలు లేవని తేల్చి చెప్పేసారు. అదే విధంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశం లేదని కుండ బద్దలు కొట్టారు. ప్రభుత్వ..ప్రయివేటు భాగస్వామ్యంతోనే ఆర్టీసి నడుస్తుందని స్పష్టం చేసారు. 15 రోజుల్లోగా ఆర్టీసి తిరిగి సాధారణ బాట పడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసి మనుగడ సాధించాలంటే కొన్ని చర్యలు తప్పవనీ, భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమశిక్షణారాహిత్యం, బ్లాక్మెయిల్ విధానం శాశ్వతంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు..
సమ్మె కొనసాగుతున్న సమయంలో వాస్తవ పరిస్థితుల పైన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీంతో.. విధుల్లో చేరని ఉద్యోగుల పైన వేటు వేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రయివేటు బ బస్సులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇక ఆర్టీసీలో చేరే ఉద్యోగులకు యూనియన్లతో సంబంధం లేకుండా పని చేస్తామని అఫిడవిట్ ఇస్తేనే ఉద్యోగంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సంస్థ ఉన్న నష్టాల నుండి ఆర్టీసీని కాపాడుకొని..నిర్వహణ కొనసాగాలంటే రెండు లేదా మూడు నెలలు సమయం పడుతుందని అధికారులు వివరించారు. ఇక, సమ్మెకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు మరింత ముమ్మరం చేయాలని.. చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదే విధంగా అఖిలపక్షం కూడా ఉండదని ముఖ్యంత్రి ఖరా ఖండిగా తేల్చేసారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏం చేస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.