నిజామాబాద్ కు సీఎం కేసీఆర్.. నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం; భారీ బహిరంగసభ!!
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన సాగిస్తున్న విషయం తెలిసిందే. వివిధ జిల్లాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు భారీ బహిరంగ సభలలో పాల్గొంటూ కెసిఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక ఇదే క్రమంలో సెప్టెంబర్ 5వ తేదీన నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

నిజామాబాద్ లో కేసీఆర్ పర్యటన .. షెడ్యూల్ ఇదే
సీఎం కేసీఆర్ షెడ్యూల్ విషయానికి వస్తే ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ఎల్లమ్మ గుట్టలోని టిఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ టిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, ఆపై నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

నిజామాబాద్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ముస్తాబైన నగరం
ఇక నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను భారీగా పెంచారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతతోరణాలను ఏర్పాటుచేసి నిజామాబాద్ నగరాన్ని ముస్తాబు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను సక్సెస్ చేయడం కోసం దాదాపు రెండు లక్షల మందితో జనసమీకరణ చేపట్టారు.

టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ... కేసీఆర్ పర్యటనపై ఉత్కంఠ
టిఆర్ఎస్ శ్రేణులు బహిరంగ సభలో జిల్లా వాసులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, తదితరులు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కెసిఆర్ బహిరంగ సభలో చేస్తున్న వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలలోనూ దుమారం రేపుతున్నాయి.

కామారెడ్డిలో నిర్మలా సీతారామన్ పర్యటన, కేసీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు .. రివర్స్ ఎటాక్ చేస్తారా?
ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కేంద్రంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన సాగించి తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ మంత్రులను తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిన నేపథ్యంలో నేడు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ నిర్మల సీతారామన్ కు కౌంటర్ ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. నిజామాబాద్ సభా వేదికగా మరోమారు బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తారని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications