ఇద్దరు ముఖ్యమంత్రులతో యాదాద్రి ఆలయానికి కేసీఆర్: ఖమ్మం సభకు హాజరయ్యేది వీరే..!!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. మొన్నటి వరకు మనుగడలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి- భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఇక పార్టీ విస్తరణ కార్యకలాపాలపై కసరత్తు చేస్తోన్నారు. అటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిరాటంకంగా కొనసాగిస్తూనే- జాతీయ రాజకీయాలకు మరింత పదును పెడుతున్నారు..క్రియాశీలకంగా వ్యవహరించబోతోన్నారు.
ఈ పరిణామాల మధ్య బుధవారం ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు గులాబీ బాస్. జాతీయ స్థాయి రాజకీయ నాయకులందరూ తన వైపు చూపు సారించేలా ఈ సభను ప్లాన్ చేశారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తరువాత ఈ స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ పార్టీల నాయకులు దీనికి హాజరు కానున్నారు.
ఖమ్మం సభకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావడం ఖాయమైంది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఇందులో పాల్గొననున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామి సైతం ఈ సభకు వస్తారనే అంచనాలు ఉన్నాయి.
ఖమ్మం బయలుదేరి వెళ్లడానికంటే ముందే కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఆయనతో పాటు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్తారు. 11.30 గంటలకు యాదాద్రి కి చేరుకుంటారు.
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 వరకు అక్కడే ఉంటారు ముగ్గురు ముఖ్యమంత్రులు. అనంతరం యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్తారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 3:30 నిమిషాలకు ఖమ్మం సభ వేదిక వద్దకు చేరుకుంటారు.