యాదాద్రిలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన .. ప్రధానంగా ఫోకస్ దేనిపైనంటే !!
తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా, అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేయిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటివరకు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టిన నాటి నుండి నేటి వరకు 11 సార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్ నేడు 12 వ సారి యాదాద్రి ఆలయ పనుల పరిశీలనకు వెళుతున్నారు.
యాదాద్రి వివాదం ... మూలవిరాట్టు లో మార్పులు అవాస్తవం ... జరిగిందిదే !!
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
ఉదయం 11 గంటలకు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ నిర్మాణపనుల పురోగతినిపరిశీలిస్తారు. అలాగే ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను పరిశీలించి మహా సుదర్శనయాగం జరిగే ప్రాంతాన్ని సందర్శిస్తారు. నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. యాదాద్రిలో బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కొత్తగా నిర్మించిన ఆలయాన్ని, అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.
మూల విరాట్ ను మళ్ళీ చెక్కారని విమర్శలపై కూడా చర్చించే అవకాశం
ఇటీవల ఆలయ నిర్మాణం విషయంలో, మూలవిరాట్ ను మళ్లీ చెక్కారు అని విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని సీరియస్ గా తీసుకుంది. దీంతో ఇలాంటి అంశాలపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో, ఆలయ అర్చకులతో చర్చించనున్నారు. ఇప్పటికే 95 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ఆలయం ఎప్పుడు ప్రారంభించాలి అన్న ముహూర్తం నిర్ణయించిన తరువాత మహా సుదర్శన యాగం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
మహా సుదర్శన యాగానికి స్థల పరిశీలన చెయ్యనున్న సీఎం కేసీఆర్
ఇక ఈ యాగానికి సంబంధించి వంద ఎకరాల భూమిలో 1018 కుండాలతో దేశ విదేశాల నుండి మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించి అత్యంత ఘనంగా మహా సుదర్శన యాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక దీనికి అనువైన ప్రాంతంగా గండి చెరువు ప్రాంతాన్ని ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ ఆ ప్రాంతాలను మహా సుదర్శన యాగం నిర్వహించడానికి ఆహ్వానించే అతిథులకు సంబంధించి వసతులను, రవాణా సౌకర్యాలను పరిశీలించనున్నారు.
చిన్నజీయర్ స్వామితో సంప్రదింపులు జరిపాకే ఆలయ ప్రారంభానికి ముహూర్తం
ఇక అంతే కాదు ఆలయ ప్రారంభానికి ముహూర్తంపై చిన జీయర్స్వామితో సంప్రదింపులు జరపనున్నారు సీఎం కేసీఆర్. అలాగే కొండచుట్టూ నిర్మాణంలో ఉన్న ఆరు లేన్ల రహదారి, నిర్వాసితుల పునరావాసం వంటి అంశాల్ని కూడా సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకొని తదితర అంశాల పైన కూడా అధికారులతో చర్చిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ కే నారాయణరెడ్డి పరిశీలించారు. నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి లో పర్యటించి తుది దశకు వచ్చిన ఆలయ పునర్నిర్మాణ పనులను చూసి ఆలయ ప్రారంభోత్సవానికి , మహా సుదర్శన యాగానికి చేయవలసిన సన్నాహాలపై సమీక్షించనున్నారు.