రైతు భరోసా అమలుపై రేవంత్ కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో రైతులు నిరీక్షిస్తున్న రైతు భరోసా అమలు పైన సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. ఎప్పుడు అమలు చేసేదీ వెల్లడించారు. అదే విధంగా సన్నాలు పండించే రైతులకు బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రెండు లక్షల వరకు రైతులు అందరికీ రుణమాఫీ చేసామని రేవంత్ స్పష్టం చేసారు. రైతులకు ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తామని..ఎవరు వచ్చి ఏం చెప్పినా నమ్మవద్దని కోరారు. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి చేసి చూపించామని రేవంత్ గుర్తు చేసారు.
ముఖ్యమంత్రి రేవంత్ రైతులకు రైతు భరోసా అమలు పై స్పష్టత ఇచ్చారు. ఏడాది పాలన పైన సంతృప్తి ఉందని రేవంత్ వెల్లడించారు. రైతు భరోసా పైన ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం నియమించిన విషయాన్ని గుర్తు చేసారు. భట్టి కమిటీ ఇచ్చే నివేదికను ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి చర్చిస్తామని చెప్పారు. రైతు భరోసా అమలు పైన సభలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఎంత మేర అమలు చేస్తారు.. ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలనేది చర్చ జరుగుతోంది. సాగు చేసే రైతులకు ఇవ్వాలనే చర్చ వినిపిస్తోంది. దీంతో, రైతు భరోసా అమలు పైన సబ్ కమిటీ వేసినట్లు సీఎం వెల్లడించారు.

శాసనసభలో చర్చ తరువాత అమలు పైన నిర్ణయం తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేసారు. సంక్రాంతి తరువాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ ప్రకటించారు. రైతుభరోసా కు అడ్డు పడేందుకు అనేక మంది వస్తారని పరోక్షంగా ప్రతిపక్షాల పై విమర్శలు చేసారు. ఇక.. రైతులకు వరి సన్నాలు పండిస్తే బోనస్ చెల్లిస్తామని రేవంత్ స్పష్టం చేసారు. రైతులు పండించే సన్నాలను తెలంగాణలోని హాస్టల్స్ కే వినియోగిస్తామని వెల్లడించారు. తాము ప్రకటించిన విధంగా నిర్దిష్ట సమయంలో రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న 25 లక్షల మంది రైతులకు రుణ మాఫీ అమలు చేసామని...ఎవరికైనా మానవ తప్పిదంతో అమలు కాకుంటే వారికి అమలు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications