Revanth Reddy:రేవంత్ సెల్ఫ్ గోల్ - సీన్ ఛేంజ్, కొత్త లెక్కలు..!!
Revanth Reddy:తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అప్పటి నుంచి పలు సందర్భాల్లో పార్టీలోని అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. ప్రధాన వార్తల్లో నిలిచాయి. కేవలం రేవంత్ రెడ్డి కష్టంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తుండగా... దశాబ్దాలుగా పార్టీ విధేయులుగా ఉన్న కొందరు సీనియర్లు మాత్రం ఈ వాదనతో విబేధిస్తున్నారు.
2018లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత తిరిగి ఆ పార్టీకి ఊపరి ఊదింది మాత్రం రేవంత్ రెడ్డే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో రేవంత్ పగ్గాలు తీసుకోవడం పార్టీకి పునర్జన్మను ప్రసాదించినప్పటికీ, కాంగ్రెస్లోని సీనియర్లు మాత్రం రేవంత్ను బయటి వ్యక్తిగానే చూస్తున్నారనే వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది.

రేవంత్కు మంత్రులకు లేని సఖ్యత..?
రేవంత్ రెడ్డి తరుచూ ఢిల్లీ వెళ్లడం, మార్చి నెలలోనే కొందరిని ఛెర్మెన్లుగా నియమిస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయలేకపోవడం, కొందరు మంత్రులు చేస్తున్న కొన్ని విరుద్ధమైన ప్రకటనలు కచ్చితంగా ప్రతిపక్షానికి అస్త్రాలుగా మారుతున్నాయి. చాలా సందర్భాల్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన బహిరంగ ప్రకటనలపై మంత్రులు మరో వాదన వినిపిస్తుండటమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉదాహరణకు మద్యం విక్రయించేందుకు ప్రభుత్వం కొన్ని కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ఆ అనుమతిని రేవంత్ సర్కార్ రద్దు చేసింది.
ఎక్సైజ్ శాఖ మంత్రి రెడ్ హ్యాండెడ్గా దొరికాడని అయితే మద్యం కంపెనీలకు రద్దు చేసిన అనుమతి తాత్కాలికమా లేక శాశ్వతంగా రద్దు చేశారా అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. అంతేకాదు రాష్ట్ర ఎక్సైజ్ రెవెన్యూ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఒకలా మంత్రి ప్రకటన మరోలా ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ రెవిన్యూలో పెరుగుదల ఉందని సీఎం రేవంత్ ప్రకటన చేయగా... మంత్రి మాత్రం అబ్బే అదేం లేదంటూ చెప్పుకొచ్చారు.

అభద్రతా భావంతో సీఎం రేవంత్..?
ఇక ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్లోకి ఫిరాయిస్తున్నారు. రేవంత్ పార్టీలో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ముద్ర పడింది. ఇదే విషయంపై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజన్ కల్వకుంట్ల మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు అభద్రతా భావంతో ఉన్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడు రేవంత్ను చూస్తున్నట్లు డాక్టర్ సంజయ్ అన్నారు.
ఎక్సైజ్ పాలసీల నుంచి కార్పొరేషన్ ఛైర్పర్సన్ల నియామకాల వరకు ఏ నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో సజావుగా జరగలేదనే విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు ఉన్నందునే నిర్ణయాలకు ఏకాభిప్రాయం కుదరడం లేదని చెప్పారు. ప్రజాఆరోగ్యంపై దృష్టి సారిస్తామని సీఎం బహిరంగ ప్రకటన చేసిన తర్వాత... కొన్ని మద్యం కంపెనీలకు అనుమతులు ఇవ్వడంతో ప్రతిపక్షంగా ఒత్తిడి తీసుకురావడంతో అనుమతులను రద్దు చేయడం జరిగిందనే విషయాన్ని కల్వకుంట్ల సంజయ్ గుర్తుచేశారు.

తరుచూ సీఎం ఢిల్లీ పర్యటన ఎందుకు..?
ఇక అసెంబ్లీ నిండు సభలో సీఎం ఎంపికలో ఎమ్మెల్యేలకు ఎలాంటి పాత్ర లేదని, కేవలం కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకే సీఎం ఎంపిక జరిగిందని సాక్షాత్తు ఆరోగ్యశాఖ మంత్రి చెప్పడాన్ని తప్పుబట్టారు. అంటే రేవంత్ రెడ్డిని ఇంకా బయటి పార్టీ వ్యక్తిలానే చూస్తున్నారా అనే అనుమానాన్ని డాక్టర్ సంజయ్ వ్యక్తం చేశారు. రేవంత్ పాలనపై,పార్టీపై, మంత్రులపై నియంత్రణ కోల్పోయారని విమర్శించిన సంజయ్... చాలా మంది మంత్రులు రేవంత్కు వ్యతిరేకంగా ఉన్నారనేది బహిరంగ రహస్యమేనంటూ చెప్పుకొచ్చారు.
స్వయంగా ముఖ్యమంత్రే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం చూస్తే తన బలాన్ని నిరూపించుకునేందుకు, పార్టీపై పట్టు ఉందనే సంకేతాలు పంపుతున్నారని విమర్శించారు. ఇక తరుచూ ఢిల్లీకి వెళ్లడం చూస్తే రేవంత్కు పట్టులేదనే విషయం స్పష్టమవుతోందని చెప్పిన సంజయ్... మంత్రులను కంట్రోల్లో పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సహాయం కోరుతున్నారని ఆరోపించారు. ఇదంతా నిజం కాకపోతే ఒక ముఖ్యమంత్రికి ఒక వారంలోనే ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లాల్సిన పనేంటని సంజయ్ ప్రశ్నించారు.

రేవంత్ తీరుపై బీజేపీ విమర్శలు
ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన బీజేపీ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. వన్ఇండియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని సీఎంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. పార్టీలో ప్రభుత్వంలో అంతర్గత విబేధాలున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పిన సుభాష్... స్థిరంగా లేని రేవంత్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని జోస్యం చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన చాలావరకు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించడం మానేసి రేవంత్ రెడ్డి పార్టీలో తన పట్టును నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారని సుభాష్ ఘాటు ఆరోపణలు చేశారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలతో భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని సుభాష్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications