మోదీ వద్ద ఆ డిమాండ్లు: చంద్రబాబుతో రేవంత్ భేటీకి ముందు ఢిల్లీలో అనూహ్యం
Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై రాబోతోన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు రేవంత్ రెడ్డి. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు.
విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవలే ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన శనివారం సమావేశమౌదామంటూ సూచించారు. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు.

ఈ లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఈ లేఖను పంపించారు. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. 6వ తేదీన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబాఫులే భవన్లో సమావేశమౌదామని చెప్పారు.
ఈ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డి.. దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ప్రధానిని కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. కొన్ని కీలక ప్రతిపాదనలు, డిమాండ్లను ప్రధాని ముందు ఉంచినట్లు తెలుస్తోంది. .
ప్రధానంగా- రాష్ట్ర విభజనకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించే దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలంటూ మోదీని రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారని అంటున్నారు. విభజన చోటు చేసుకున్నప్పటి నుంచీ నలుగుతూ వస్తోన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సహా ఇతర పెండింగ్ ప్రాజెక్టులను మోదీ దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు.
విభజన హామీల్లో ఇప్పటివరకు కేంద్రం నెరవేర్చింది ఒక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటే. ములుగులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీనికోసం గతంలో తెలంగాణ ప్రభుత్వం 331 ఎకరాలను కేటాయించింది. ప్రస్తుతం దీని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.
తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 450 కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సి ఉంటుందంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చింది కేంద్రం. అది పూర్తిగా అమలు కావట్లేదు. నాలుగు సంవత్సాల పాటు మాత్రమే ఈ నిధులు మంజూరయ్యాయి. ఆ తరువాత వాటి ఊసే లేదు.

ఆయా సమస్యలు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. దీనిపై మోదీ సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరగా విభజన హామీలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంతకుముందు- రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానూ కలిశారు. గంట పాటు ఈ భేటీ కొనసాగింది. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆధునికీకరించడానికి అవసరమైన నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోరారు.
డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి నియంత్రణ, సైబర్ నేరాలను అరికట్టడానికి ఈ రెండు బ్యూరోలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికోసం యాంటీ నార్కొటిక్స్ బ్యూరో- 88, సైబర్ సెక్యూరిటీ బ్యురో కోసం ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయడానికి 90 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications