ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి!!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదానికి గురై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే గా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికైన లాస్య నందిత దుర్మరణం పాలు కావడం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమె అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నకు తనకు సన్నిహితసంబంధం ఉండేదని గత సంవత్సరం ఇదే నెలలో ఆయన కన్నుమూయడం, ఈ సంవత్సరం ఇదే ఫిబ్రవరి నెలలో సాయన్న కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం పాలవడం అత్యంత విషాదకరం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలను పొందిన లాస్య నందిత కాలం మరణం చెందడం ఎంతో బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.
కష్టకాలంలో వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కుటుంబానికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా లాస్య నందిత మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. లాస్య నందిత ఇకలేరు అనే అత్యంత విషాదకరమైన షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నానని చాలా మంచి యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం తీవ్రనష్టం అని ఆయన అన్నారు.
ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఇక ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications