రాహుల్కు మోడీ అందుకే మైక్ ఇవ్వలేదు.. రేవంత్ హాట్ కామెంట్స్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మహత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ల గడ్డపైన, సబర్మతీ నది ఒడ్డున రెండు రోజులుగా మనం మేధో మదన (చింతన్ బైఠక్) సదస్సు జరుపుకుంటున్నామన్నారు.
అధికారం చేపట్టిన తర్వాత దేశంలో మోడీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు సబర్మతీ ఒడ్డున మనం ఇక్కడ సమావేశమయ్యామన్నారు రేవంత్. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో మనం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ మిత్రులు, దేశ నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరూ మోదీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
మోడీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చారు. వాటికి వ్యతిరేకంగా రైతులు 14 నుంచి 15 నెలలు ధర్నాలు చేసినా చర్చలకు రాలేదు. మోడీ మణిపూర్లో మంటలు రాజేశారు. దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం మోడీ చేశారని విమర్శించారు.
రాహుల్ హామీలను నిలబెట్టుకున్నాం
మరో వైపు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. కుల గణన, రైతు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళల సంక్షేమంపై ఆయన వాగ్దానాలు చేశారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు కుల గణన, రైతు రుణమాఫీ, నిరుద్యోగ నిర్మూలన, మహిళల సంక్షేమానికి రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని రేవంత్ తెలిపారు.
రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 25 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ తెలిపారు. మేం తెలంగాణలో కుల గణన చేసి చూపించాం. కుల గణనపై రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడాతారనే భయంతో ఆయనకు లోక్సభలో మోదీ మైక్ ఇవ్వ లేదని రేవంత్ అన్నారు.
ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదకొండు సంవత్సరాలు దాటిపోయింది. ఈ లెక్కన 20 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి. మోదీ, అమిత్ షాకు ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయి...ప్రతి ఏటా 2 కోట్ల యువకులకు ఉద్యోగాలు రాలేదు. దేశంలోని మూలమూలన ఉన్న గాంధేయవాదులు మోదీ వ్యతిరేక పోరాటంలో రాహుల్గాంధీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్.
గాంధీ వారసులు.. గాడ్సే వారసులను ఓడించాలి
గాంధీ ఆలోచనధారతో ఉన్న మనమంతా.. గాడ్సే వారసులను, మోదీని ఓడించాలి. రైతులు, యువత, మహిళల కోసం సీడబ్ల్యూసీలో సాగిన చర్చలపై ఆశతో నేను ఇక్కడి నుంచి వెనక్కు వెళుతున్నా. తెలంగాణలో మేం బీజేపీకి అవకాశం ఇవ్వం... గుజరాత్ గడ్డపై నుంచి నేను చెబుతున్నా.. మేం నిజాం ప్రభుత్వం కింద ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో మాకు స్వాతంత్య్రం వచ్చింది. అందుకే గుజరాత్ ప్రజలతో, వల్లభాయ్ పటేల్ వారసులతో మా తెలంగాణ ప్రజలకు సంబంధం ఉందని సీఎం రేవంత్ చెప్పారు.
మాకు స్వాతంత్య్రం ప్రసాదించిన వల్లభాయ్ పటేల్తో మాకు హృదయపూర్వకమైన బంధం ఉంది. మాకు స్వాతంత్య్రం వల్లభాయ్ పటేల్ ఇచ్చారు.. తెలంగాణను మాకు సోనియా గాంధీ అందించింది. వల్లభాయ్ పటేల్ భూమి నుంచి నేను ఒక్కటే చెబుతున్నా... సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం.. వారిని ఎవరూ క్షమించరు అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గాంధీ మీద బ్రిటీష్ వాళ్లు ఎప్పుడూ లాఠీ ప్రయోగం చేయలేదు
గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దండి సత్యాగ్రహంతో పాటు 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశారు. కానీ, బ్రిటిష్వాళ్లు ఎప్పుడూ గాంధీజీ మీద లాఠీ ప్రయోగం చేయలేదు. స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే వారసులు గాంధీజీపై తుటా పేల్చి ఆయనను హత్య చేశారు. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులు... బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో మనమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలి అని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపునిచచారు.
మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా సిద్దంగా ఉండాలి. తెలంగాణలో బీజేపీని అడ్డుకునేందుకు, ఓడించేందుకు మేం ఇక్కడి నుంచి ఆశను, ఆదేశాన్ని తీసుకొని వెళుతున్నాం. రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, గాంధీ వారసులు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాలని నా విజ్ఞప్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇది ఇలావుండగా, బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిల్లు కేంద్రానికి పంపినా.. ఆ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శించారు. తెలంగాణలో కులగణన విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలుస్తుందని రాహుల్ చెప్పారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపిందన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తామన్నారు. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంపదలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన భాగస్వామ్యం లేదని, వారి జనాభాకు అనుగుణంగా సంపదలోనూ తగిన వాటా అవసరమని రాహుల్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications