కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ తీర్మానం, అసెంబ్లీ ఆమోదం: నీతి ఆయోగ్ భేటీకి దూరం
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర శాసనసభ బుధవారం తీర్మానం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్లో అవసరమైన మేరకు సవరణలు చేయాలని శాసనసభ కోరింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించిందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపిందన్నారు సీఎం రేవంత్.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనతోపాటు, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం కోరటంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించారని సీఎం రేవంత్ తెలిపారు.
కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోందని సీఎం రేవంత్ వివరించారు. కేంద్రంపై పోరాటానికి ప్రతిపక్షాలు తమతో కలిసి రావాలన్నారు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షను నిరసిస్తూ శాసనసభ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్ లో అవసరమైన మేరకు సవరణలు చేయాలని శాసనసభ కోరింది.
— Telangana CMO (@TelanganaCMO) July 24, 2024
🔸అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం:… pic.twitter.com/mJT1YgPlJ9
ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తుందని సీఎం రేవంత్ వివరించారు. ప్రతిపక్షాలతో కలిసి కేంద్రానికి నిరసన తెలియజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయానికి నిరసనగా తాము వచ్చే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications